మాధవరెడ్డి హత్య నయీంకు ముందే తెల్సు: మాజీ సంచలనం, తెరాస నేతతోను లింక్!
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం పదిహేడు సంవత్సరాల క్రితం పోలీసు ఇన్ఫార్మర్గా తనకు తెలుసునని, అప్పట్లో ఎన్నో విషయాలు తనకు చెప్పాడని, ఎలిమినేటి మాధవ రెడ్డిని నక్సల్స్ హత్య చేసే ఆలోచనలో ఉన్నట్టు అతనికి తెలుసునని పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి శ్రీరామ్ తివారీ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
వ్యాస్ హత్యానంతరం, కొంతకాలం జైలులో ఉన్న నయీం, ఆపై పోలీసులతో కలసి పని చేశాడని, తాను కూడా రెండు మూడుసార్లు అతనిని కలిశానని చెప్పారు. నక్సల్స్ గురించి అతనిచ్చే సమాచారం పక్కాగా ఉండేదన్నారు.
1997-2000 మధ్య ఎస్బీఐ చీఫ్గా తాను పని చేస్తున్న సమయంలో జైలులో ఉన్న నయీం ఓ వీఐపీని పీపుల్స్ వార్ టార్గెట్ చేసిందని చెప్తే, వాటిని తామే సరిగా డీకోడ్ చేయలేకపోయామని చెప్పారని వార్తలు వస్తున్నాయి.
నాటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన దాడి జరుగుతుందన్న ఆలోచనతో తాము ఉండగా, నాటి హోంమినిస్టర్ ఎలిమినేటి మాధవరెడ్డిపై దాడి జరిగిందన్నాడు. ఇప్పుడు అతను ఇంతపెద్ద గ్యాంగ్ స్టర్గా మారి వేల కోట్లు కూడబెట్టాడని వింటుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు.
నయీం బాధితులు ఈ ఫోన్లో సంప్రదించవచ్చు
నయీం బాధితులు కానీ, అతని గురించి మరింత సమచారం తెలిసినవారు నేరుగా గాని, సిట్ సెల్నంబర్ 9440627218కు గాని ఫిర్యాదు చేయొచ్చని సిట్ ఛీఫ్ నాగిరెడ్డి తెలిపారు. సైబరాబాద్లోని అదనపు డీసీపీ (నేరాలు) కార్యాలయంలోగానీ, రాష్ట్రంలోని ఏ పోలీస్ స్టేషన్లోనైనా సంప్రదించవచ్చన్నారు.
పెద్ద ఎత్తున అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగినందు వల్ల ఈడీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఆదాయ పన్ను శాఖకు సమాచారం ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు నయీం అనుచరులకు సంబంధించిన ఆధారాలు మాత్రమే లభించాయన్నారు. పోలీసులు, రాజకీయ నాయకుల పాత్రపై ఇంకా సమాచారం లేదన్నారు.
నల్గొండ జిల్లాకు చెందిన పలువురు నాయకులకు నయీంతో సంబంధాల ఉన్నా విషయం తెలిసిందే. అందులో అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. ఇందులో యాదగిరిగుట్టకు చెందిన అధికార పార్టీ నాయకుడొకరు నయీంకు అత్యంత సన్నిహితుడన్న వార్తలు వస్తున్నాయి.