రేవంత్ రెడ్డి వీడియో దృశ్యాలు, మాటలు అసలువే: ఎఫ్ఎస్ఎల్ సంచలనం
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) తొలి నివేదికను సాక్షి టీవీ చానెల్ బయటపెట్టింది. ఇందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. జులై 24వ తేదీన ఎఫ్ఎస్ఎల్ తన నివేదికను సమర్పించింది. ఎఫ్ఎస్ఎల్ 14 టేపులను ఎఫ్ఎస్ఎల్కు సమర్పించింది.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్కు డబ్బులు ఇస్తున్న వీడియో అసలుదేనని, ఏ విధమైన ఎడిటింగ్ జరగలేదని ఎఫ్ఎస్ఎల్ నివేదిక తేల్చింది. ఇది మూడు ఆడియోలు, మూడు వీడియోలకు సంబంధించిన నివేదిక అని సాక్షి టీవీ చానెల్ కథనం తెలిపింది.
వీడియోలోని మాటలు కల్పితాలు కావని, పెదవుల కదలికను కూడా అధ్యయం చేశామని ఎఫ్ఎస్ఎల్ నివేదిక తెలిపింది. రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినప్పుడు ఎసిబి స్వాధీనం చేసుకున్న రెండు నోకియా ఫోన్లను కూడా ఎఫ్ఎస్ఎల్ విశ్లేషించింది.
ఆడియో, వీడియో టేపుల్లో ఎక్కడా మార్ఫింగ్ గానీ ఎడిటింగ్ గానీ జరగలేదని ఎఫ్ఎస్ఎల్ తేల్చింది. మొత్తం మూడు ఫైల్స్లో వీడియో దృశ్యాలున్నాయి. ఎవరు ఎవరితో మాట్లాడారో, ఏం మాట్లాడారో కూడా ఎఫ్ఎస్ఎల్ తేల్చింది. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టీఫెన్సన్తో మాట్లాడినట్లు చెబుతున్న సంభాషణల టేపునకు సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
తమ చేతిలో ఎఫ్ఎస్ఎల్ సమర్పించిన తొలి నివేదిక ఉందని సాక్షి చెప్పుకుంది. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, స్టీఫెన్సన్ల మధ్య జరిగిన సంభాషణల టేపులను ఎఫ్ఎస్ఎల్ విశ్లేషించింది. ఎవరు ఎవరితో ఏం మాట్లాడారో చాలా వివరంగా ఎఫ్ఎస్ఎల్ తన నివేదికలో తెలిపింది.