సర్కారువారిపాట: కమాన్ కమాన్ కళావతి.. కొంప మునిగిందే కళావతి!!
సర్కారువారిపాట సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ తెచ్చుకుందనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. వాస్తవానికి సినిమా మరీ అంత నాసిరకంగా ఏమీ లేదని, ఒకసారి చూడొచ్చంటున్నారు. అయినా ఈ సినిమాకు సంబంధించి నెగెటివ్ ట్రోలింగ్ దారుణంగా జరుగుతోంది. గతంలో ఏ మహేష్బాబు సినిమాకు కూడా జరగనంత ట్రోలింగ్ ఈ సినిమాకు జరుగుతోంది.
ఫ్లాప్ అయినా ఒడ్డున పడేవారు
గతంలో ఏ సినిమా విడుదలైనా హిట్ అయిన సినిమాకు లాభాలొచ్చేవి. ఫ్లాప్ అయిన సినిమా అయినా కాస్తో కూస్తో అయినా నిర్మాతతోపాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఒడ్డున పడేవారు. లేదంటే తర్వాత సినిమాతో వారిని ఆదుకునేవారు. నష్టాలొచ్చినా ఇప్పుడున్నంతస్థాయిలో ఉండేవికావు. ఎందుకంటే ప్రేక్షకులు ఫ్లాప్ సినిమా అయినా ఒకసారి చూసేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఫ్లాప్ అని మొదటి ఆటకు టాక్ వస్తే చాలు.. ఎంత వీరాభిమానులైనా థియేటర్కు వెళ్లడం ఆగిపోతున్నారు.
టికెట్ ధరలు దారుణం
ఇందులో మొదటి కారణం థియేటర్ టికెట్ ధరలు. ఇటీవలి కాలంలో కథానాయకులు, దర్శకులు, నిర్మాతలు ప్రభుత్వాల దగ్గరకు వెళ్లి తమ సినిమా బడ్జెట్ ఇంత అయ్యిందని, టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతివ్వాలని కోరేవారు. ప్రభుత్వాలు కూడా అనుమతిస్తున్నాయి. ఇప్పుడు ఈ అనుమతులే థియేటర్లతోపాటు నిర్మాతల కొంప మునగడానికి కారణమయ్యాయి. ఒక మల్టీప్లెక్స్ కు కుంటుంబంతో సహా వెళ్లి సినిమా చూడాలంటే మూడువేల రూపాయల వరకు ఖర్చుచేయాల్సి వస్తోంది. అదే సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్కు వెళ్లి చూడాలంటే రెండువేల రూపాయలవుతున్నాయి.
ఓటీటీలో వస్తోంది కదా!!
దీంతో సినిమా ఎలాగూ విడుదలైన నెలరోజులకే ఓటీటీల్లో వచ్చేస్తోంది కదా అనే ఉద్దేశంతో అదనపు ఖర్చును తగ్గించుకునే పనిలో ప్రేక్షకులున్నారు. ఒక అగ్ర కథానాయకుడి సినిమా ఫ్లాప్ అయినా దాదాపుగా బ్రేక్ ఈవెన్ వచ్చేది. ఇప్పుడు ఎంత అగ్ర కథానాయకుడైనా ఫ్లాప్ అంటే చాలు మ్యాట్నీ నుంచి ప్రేక్షకులు వెళ్లడం మానేస్తున్నారు. థియేటర్ టికెట్ ధరలు తలుచుకుంటేనే గుండెలు దడదడమనే పరిస్థితిని నిర్మాతలు, దర్శకులు, కథానాయకులు కలిసి తీసుకువచ్చారు. పెరిగిన ధరలతో థియేటర్లకు రావడం మానేస్తున్నారు. దాంతో బ్రేక్ ఈవెన్ కాదుకదా.. భారీస్థాయిలో నష్టాలొస్తున్నాయి. అవి కూడా పూడ్చుకోలేనంతగా ఉంటున్నాయి.
మహేష్బాబు సినిమా అంటే కుటుంబంతో సహా వెళతారు
సర్కారువారి పాట చిత్రానిది కూడా అదే పరిస్థితి. ఒకవైపు అసని తుఫాను, మరోవైపు టికెట్ ధరలతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. సాధారణంగా మహేష్బాబు సినిమా అంటే కుటుంబం మొత్తం కలిసి వెళ్లేవారు. అటువంటిది సర్కారువారిపాట సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకుంటుందా? లేదా? అనే సందేహం ఇప్పుడు సినీ పరిశ్రమవర్గాలను వెంటాడుతోంది. ప్రభుత్వాలు అనుకూలంగా పనులు చేస్తున్నాయికదా అన్న ధైర్యంతో ఇష్టమొచ్చినట్లుగా టికెట్ ధరలు పెంచుకొని అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలనుకునేవారందరికీ ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు మర్చిపోలేని తీర్పునిచ్చాయి. దీంతో గతంలో ఉన్న సాధారణ టికెట్ ధరలనే అమలు చేయాలని సినీ పెద్దలు ప్రభుత్వాన్ని కోరబోతున్నారు.