కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు: మెజారిటీ సీట్లలో టిడిపి, పాతబస్తీలో చెరిసగం
హైదరాబాద్: హైదరాబాదు మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బిజెపి మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మెజారిటీ సీట్లలో టిడిపి పోటీ చేయనుంది. గ్రేటర్లోని 150 డివిజన్లలో టిడిపి 90 స్థానాల్లో, బిజెపి 60 సీట్లలో పోటీ చేయనున్నాయి.
అసంతృప్తిగానే అయినా సీట్ల సర్దుబాటుకు బిజెపి అంగీకరించింది. శుక్రవారం అర్థరాత్రి దాటేవరకు ఇరు పార్టీల నాయకుల మధ్య చర్చలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, జి. కిషన్ రెడ్డి, డాక్టర్ కె. లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి ఈ చర్చల్లో పాల్గొన్నారు.
చెరిసగం సీట్లకు పోటీ చేద్దామని బిజెపి నాయకులు పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో చర్చలు సుదీర్ఘంగా కొనసాగుతూ వచ్చాయి. అయితే, టిడిపి నాయకులు దానికి అంగీకరించలేదు. రంగారెడ్డి జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో తమ పార్టీ బలంగా ఉందని, అందువల్ల ఆ ప్రాంతాల్లోని సీట్లలో తామే పోటీ చేస్తామని టిడిపి నాయకులు చెబుతూ వచ్చారు.
చివరికి టిడిపి తన పంతం నెగ్గించుకుంది. పాతబస్తీలో బిజెపి, టిడిపి చెరి సగం సీట్లకు పోటీ చేయనున్నాయి. బిజెపి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆసెంబ్లీ నియోజకవర్గాల పరిధుల్లో ఎక్కువ డివిజన్లలో బిజెపి పోటీ చేయనుంది. చర్చలు కొలిక్కి రావడంతో ఇరు పార్టీలు కూడా శనివారం తమ తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.