సికింద్రాబాద్ విధ్వంసం: అధికార టీఆర్ఎస్ డబ్బులిచ్చి చేయించిందే: ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణ
అగ్నిపథ్ పథకంపై కొనసాగుతున్న రగడ తెలంగాణ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ముఖ్యంగా బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్టు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఘటనపై అధికార టీఆర్ఎస్ పార్టీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
రైల్వే స్టేషన్ లో రోజంతా విధ్వంసం సాగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?
గత రెండు మూడు రోజులుగా భారత ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ ప్రతిపక్షాలు, రాష్ట్ర పాలక పక్షమైన టిఆర్ఎస్ పార్టీ ప్రవర్తించిన తీరు బాధాకరంగా ఉందని రఘునందన్ రావు పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా బిజెపి శక్తి కేంద్రాల ఇన్చార్జిల కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల నాయకులు పర్యటనలు చేయకుండా అడ్డుకుంటూ వారిని అరెస్టు చేస్తున్న పోలీసులు, రైల్వే స్టేషన్లో రోజంతా విధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
అధికార టీఆర్ఎస్ డబ్బులిచ్చి చేయించిన విధ్వంసం
రైల్వే స్టేషన్ లో విధ్వంసం ఘటన అధికార పార్టీ డబ్బులు ఇచ్చి కావాలని చేయించిన ఘటననేనంటూ రఘునందన్ రావు ఆరోపణలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్ కావాలని యువతను రెచ్చగొట్టి ఇలాంటి దాడులకు తెగిస్తుందని మండిపడ్డారు. ఈ దేశానికి సేవ చేయాలనుకుంటే అలాంటి అభ్యర్థులు ఇతరుల మాటలు విని తప్పుదోవ పట్టవద్దని ఎమ్మెల్యే రఘునందన్ రావు సూచించారు. ఎంతోమంది మేధావుల ఆలోచనలను తెలుసుకొని, అనేక సమీక్షలు జరిపిన తరువాత ఈ పథకాన్ని తీసుకు వచ్చారని పేర్కొన్నారు.
మోడీ సభకు భారీగా జనసమీకరణ చెయ్యాలన్న రఘునందన్ రావు
అగ్నిపథ్ పథకం యువతకు ఎంతో లబ్ధి చేకూరుస్తుందని రఘునందన్ రావు తెలిపారు. జూలై 2,3 తేదీలలో హైదరాబాద్ లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి అనేక కీలక విషయాలను వెల్లడించిన రఘునందన్ రావు, మూడవ తేదీన జరగనున్న ప్రధాని మోడీ బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జిల్లాకు లక్ష మంది చొప్పున తరలించడానికి ప్రతి జిల్లాలోనూ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని రఘునందన్ రావు తెలిపారు.