ఏరు దాటాక.. రేవంత్ ఇలా చేస్తాడా!: నమ్ముకుని వస్తే ఏం ఒరిగిందని?..
హైదరాబాద్: రాజకీయాల్లో ఏ స్టెప్ అయినా వెనకాల ఏదో మతలబు దాగుంటుంది. ప్రయోజనం లేనిదే నాయకులు ఏ పని చేయరూ. వేచి చూసే ధోరణి కూడా కొంతవరకే. అదీ అయిపోయిందంటే.. ఇక ఏదో ఒకటి తేల్చుకోవడమే. రేవంత్ను నమ్ముకుని కాంగ్రెస్ గూటికి చేరిన టీడీపీ నాయకుల మదిలోనూ ఇప్పుడిదే మెదులుతోందట. కాంగ్రెస్లో తమకు సముచిత స్థానమే కల్పిస్తారని ఆశ పెట్టుకుంటే.. చేరిక తర్వాత అసలు తమను పట్టించుకున్న పాపాన పోలేదని వాళ్లలో వాళ్లే మదనపడుతున్నారట.
Recommended Video
ఏరు దాటాక..:
రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్లిన టైమ్లో తన వెంట మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, వేం నరేందర్ రెడ్డి, బోడ జనార్ధన్ సహా పలువురు ముఖ్య నేతల్ని తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ సముచిత స్థానం దక్కేలా చూస్తానన్న హామి మేరకే రేవంత్ వెంట వారంతా నడిచారు. కానీ ఏరు దాటాక తెప్ప తగలెట్టినట్టు.. అటు రేవంత్, ఇటు కాంగ్రెస్ ఇప్పుడు తమను మరిచిపోయాయని ఆ నేతలు బాధపడుతున్నారట.
రేవంత్ ఆ మాటను విస్మరించారా?:
రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో సీతక్కను తనవైపుకు తిప్పుకోవడానికే చాలానే తతంగం నడిపించారు. తన సతీమణినే నేరుగా రంగంలోకి దింపి సీతక్కతో బేరసారాలు చేయించారు.
అలా చివరి నిమిషంలో గానీ సీతక్క రేవంత్ వెంట నడిచేందుకు దిగిరాలేదు. తన పట్టు నిరూపించుకునేందుకు ఆ సమయంలో తమను బాగానే బుజ్జగించిన రేవంత్.. తమకిచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాడని సీతక్క సహా మిగతా నేతలు భావిస్తున్నారట.
అసలు పదవులు దక్కుతాయా?
సంక్రాంతి తర్వాత కాంగ్రెస పార్టీలో కార్యవర్గ ప్రక్షాళన జరుగుతుందన్న ప్రచారం అప్పట్లో జరిగింది. దీంతో కొత్తగా చేరిన తమకు పదవులు దక్కుతాయేమోనని సీతక్క, వేం నరేందర్ రెడ్డి, బోడ జనార్దన్.. తదితరులు ఆశించారు. కానీ అలాంటిదేమి జరగకపోవడంతో.. అసలు కాంగ్రెస్లో తమకు పదవులు వస్తాయా? అన్న సందేహంలో పడిపోయారట.
రేవంత్ను నమ్ముకుంటే ఒరిగిందేమిటి:
ఏఐసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత రాహుల్ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. రాష్ట్రాల అధ్యక్షుల విషయంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఎటువంటి మార్పు ఉండబోదన్నారు. అదే సమయంలో కింది స్థాయి కార్యవర్గ ప్రక్షాళనను అధ్యక్షులకే వదిలేశారు.
అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం.. ఆ ప్రక్షాళనపై ఎక్కడా దృష్టి సారించినట్టు కనిపించడం లేదు. దీంతో రేవంత్ను నమ్ముకుని వస్తే.. తమకు కొత్తగా ఒరిగిందేమిటి అని ఫిరాయింపు నేతలు సన్నిహితులతో వాపోతున్నారట.