KTR: కేటీఆర్ కు హైకోర్టు బిగ్ షాక్-క్వాష్ పిటిషన్ పై కీలక తీర్పు..!
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఇవాళ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా -ఈ కార్ రేసు కేసులో ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది.ఈ కేసులో కేటీఆర్ తో పాటు మిగతా నిందితులపై ఇప్పటికే ఏసీబీతో పాటు ఈడీ కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రిటన్ కు చెందిన ఫార్ములా -ఈ కార్ కేసు నిర్వహణ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఉల్లంఘనలు జరిగాయంటూ ఏసీబీ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. దీంతో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కేటీఆర్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేటీఆర్ ను అరెస్టు చేయకుండా విచారణ జరుపుకునేలా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏసీబీ కేటీఆర్ విచారణ కోసం నోటీసులు పంపింది.

అయితే లాయర్లతో పాటు ఏసీబీ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్ .. వారి సమక్షంలోనే తనను విచారించాలని కోరారు. కానీ ఏసీబీ అధికారులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఏసీబీ ఆఫీసు నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను మళ్లీ పిలిపించేందుకు ఏసీబీ సిద్దమవుతోంది. అదే సమయంలో ఎసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. దీన్ని కొట్టేసింది. దీంతో ఏసీబీ తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలు కలిగింది.
మరోవైపు కేటీఆర్ తో పాటు ఇతర నిందితుల్ని ఇవాళ విచారణకు రావాలని ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ కూడా నెలకొంది. ఏసీబీ విచారణ తరహాలోనే ఈడీ విచారణకు కూడా కేటీఆర్ హాజరుకాకపోతే చోటు చేసుకునే పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. విచారణకు సహకరించాలన్న హైకోర్టు ఆదేశాల ఉల్లంఘనపై తిరిగి కోర్టును ఆశ్రయిస్తామని ఏసీబీ చెబుతోంది.












Click it and Unblock the Notifications