దంచికొడుతున్న ఎండలు.. తెలంగాణలోని ఆ జిల్లాలకు తీవ్ర హెచ్చరికలు జారీ
ఎండలు దంచికొడుతున్నాయి. వడగాల్పులు, ఉక్కపోతకు రాష్ట్రంలోని ప్రజలు అల్లాడుతున్నారు. ఎండల బీభత్సానికి ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దక్షిణ తెలంగాణతో పోల్చుకుంటే ఉత్తర తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దీంతో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.
మరోవైపు రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఈ మేరకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలలో 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతాల్లోనూ ఎండల తీవ్రత అధికం అయ్యే ప్రమాదం ఉందని సమాచారం. మరో 4 రోజులపాటు తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఏప్రిల్ 24న ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం, హనుమకొండలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక శని, ఆదివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలుంటాయని ఐఎండీ అంచనా వేసింది.

వేసవిలో ఎండల నుంచి రక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. రోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. దాహం వేసినా, వేయకపోయినా నీరు తాగడం అలవాటు చేసుకోవాలని సూచిస్తన్నారు. అలాగే నీటికి బదులు కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి కూడా తీసుకోవచ్చ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications