కేసీఆర్ కు షర్మిళ డెడ్ లైన్.!ఆమరణ నిరాహార దీక్ష.!ధర్నాచౌక్ లోసంచలన నిర్ణయం.!
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం కొనబోమని చెబుతున్న నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ వద్ద "రైతు వేదన" నిరాహార దీక్షకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. సాయంత్రం ఆరు గంటలకు నిరాహార దీక్ష ముగింపు సందర్బంగా వైయస్ షర్మిళ మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. శుక్రవారం నిరాహార దీక్ష చేయాలనుకున్నా పోలీసులు అనుమతి నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేసారు.
షర్మిళ సంచలన నిర్ణయం.. ధాన్యం కొనకపోతే ఆమరణ నిరాహర దీక్ష..
అంతే కాకుండా అనేక సమస్యలను అదిగమించి శనివారం నుంచి నిరాహార దీక్ష మొదలు పెట్టామని షర్మిళ తెలిపారు. 72 గంటల రైతు వేదన నిరాహార దీక్షకు ధర్నా చౌక్ వద్ద సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారన్నారు. దీంతో లోటస్ పాండ్ లో మిగిలిన 48 గంటల రైతు వేదన నిరాహార దీక్ష చేయాలనుకున్నామని, అక్కడ కూడా పోలీసులు అనుమతిని ఇవ్వలేదని షర్మిళ చెప్పారు. దీక్షచేసేందుకు వేదికను కూడా వేయనివ్వడం లేదని, వైదిక వేసినా తొలగిస్తున్నారని షర్మిళ అన్నారు. ఆఖరి గింజ వరకు వడ్లు కొంటానన్న చంద్రశేఖర్ రావు మాట నిలుపుకోవాలని డిమాండ్ చేసారు. మరో మూడు వారాలు వరి పంట కొనుగోలు చేసేందుకు కేసీఆర్ కు సమయం ఇస్తున్నామని లేదంటే నిరాహార దీక్షకు కాదు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడానికైనా సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేసారు షర్మిళ.
సీఎం కేసీఆర్ కు మూడు వారాల డెడ్ లైన్.. తనను ఆపే దమ్ము ఎవరికీ లేదన్న షర్మిళ
తెలంగాణలో వైసీపి శ్రేణులను నియంత్రించడం ఎవ్వరి తరం కాదని, తనను చూస్తుంటే చంద్రశేఖర్ రావుకు ఎందుకు అంత ఉలికిపాటని షర్మిళ ప్రశ్నించారు. చంద్రశేఖర్ రావుకు ఆడ వారి గండం ఉందని, ఇప్పుడు మమ్మల్ని చూసి భయపడటం చూస్తుంటే నిజమే అనిపిస్తోందని ఎద్దేవా చేసారు. తెలంగాణలో పోలీసుల జులూం నడుస్తోందని, పాలన చేతకాక చంద్రశేఖర్ రావు ధర్నాలు చేస్తున్నారని, చంద్రశేఖర్ రావుకు వరి కొనడం చేత కాలేదని, సీఎంతో పాటు ఆయన కుమారుడు కేటీఆర్ కూడా మాటలు చెప్పే మొనగాళ్లే కాని పూటకు బత్యం ఇచ్చే పుణ్యాత్ములు కారని మండిపడ్డారు.
కేసీఆర్ కు ఆడవారి గండం ఉంది.. అందుకే తనను చూసి వణికిపోతున్నడన్న షర్మిళ..
చంద్రశేఖర్ రావుకు ఉద్యోగాలు ఇవ్వడం కూడా చేత కాలేదని, రుణమాఫీ చేయడం అంతకన్నా చేత కాలేదని షర్మిళ మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం చేత కాలేదని, నిరుద్యోగభృతి కూడా ఇవ్వడం చేత కాలేదని, కేజీ టూ పీజీ విద్య వంటి హామీలను కూడా నిలబెట్టుకోలేని చంద్రశేఖర్ రావు వాటిపై కూడా ధర్నా చౌక్ కు వచ్చి ధర్నాలు చేయాలని సూచించారు. లేక పోతే రాజీనామా చేసి ఒక దళితున్ని ముఖ్యమంత్రిని చేయాలని సలహా ఇచ్చారు. రైతుల గురించి చంద్రశేఖర్ రావు ఆలోచన చేయడం లేదని షర్మిళ ఆందోళన వ్యక్తం చేసారు.
వరి ధాన్యం కేసీఆర్ కొనాలి.. లేకపోతే యుద్దమే నన్న షర్మిళ..
రైతుల పక్షాన పోరాడుతుంటే తమను కూడా ఆపాలని చూస్తున్నారని, ఉదయించే సూర్యున్ని ఎవరూ ఆపలేరని, తనను ఆపడం చంద్రశేఖర్ రావు తరం కాదని షర్మిళ స్పష్టం చేసారు. హుజురాబాద్ లో చంద్రశేఖర్ రావుకు ప్రజలు బుద్ధి చెప్పారని, నిరుద్యోగులు, రైతులు, రాష్ట్ర ప్రజలు చంద్రశేఖర్ రావును తరిమికొట్టే సమయం దగ్గర పడిందని అన్నారు. 3వారాలు చంద్రశేఖర్ రావుకు టైం ఇస్తున్నామని, ఆ తర్వాత షర్మిలమ్మను ఆపడం ఎవరి తరం కాదని, తమ పోరాటం ఇంకా ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఆమరణ నిరాహార దీక్ష వరకు తమ పోరాటం కొనసాగుతుందని, రైతు పండించిన ధాన్యం ఆఖరు గింజ వరకూ కొనకపోతే ఆమరణ నిరాహర దీక్షతప్పదని హెచ్చరించారు షర్మిళ.