అశ్వద్దామరెడ్డి కి ప్రభుత్వం షాక్ : టీఎంయూ కార్యాలయానికి తాళం: స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ..!
తెలంగాణ ఆర్టీసీ సమ్మె ద్వారా దాదాపు రెండు నెలలుగా వార్తల్లో నిలిచిన జేఏసీ నేత అశ్వద్దామరెడ్డికి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి సమ్మెకు ముగింపు ఇస్తూ..కార్మికులు ఎటువంటి షరతులు లేకుండా విధుల్లో చేరాలని ఆహ్వానించారు. వారిని బిడ్డలుగా చూసుకుంటానని హామీ ఇచ్చారు. అదే సమయంలో యూనియన్లకు మాత్రం అవకాశం ఇవ్వమని స్పష్టం చేసారు. వారితో ఏ రకమైన చర్చలు లేవని తేల్చి చెప్పారు. సీఎం సూచన మేరకు కార్మికులు ఈ ఉదయం నుండే విధుల్లో చేరటం ప్రారంభించారు.
ఇదే సమయంలో..సమ్మె పేరుతో ప్రభుత్వం మీద..ఏకంగా ముఖ్యమంత్రి మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన అశ్వద్దామ రెడ్డి పైన ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో..ఏకంగా ఆయన నాయకత్వం వహిస్తున్న తెలంగాణ మజ్డూర యూనియన్ కార్యాలయానికి తాళాలు వేసి..ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని ద్వారా యానియన్ కార్యాలయం మూసివేత దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అధికారుల ఆధ్వర్యంలో తాళాలు..
తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ఉమ్మడి రాష్ట్రంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ గా ఉన్న కార్మిక సంఘం తెలంగాణ కార్మిక సంఘంగా విడిపోయి..తెలంగాణ మజ్ధూర్ యూనియన్ పేరుతో కొత్త సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంఘానికి తొలుత ప్రస్తుత మంత్రి నాడు గౌరవాధ్యక్షుడిగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత హరీష్ ఈ యూనియర్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో..సకల జనుల సమ్మె సమయంలో అశ్వద్దామ రెడ్డి ఈ సంఘం నేతగా యాక్టివ్ గా వ్యవహరించారు.
ఇక, తాజా తెలంగాణ ఆర్టీసీ సమ్మె నిర్వహణలో ఇతర కార్మిక సంఘాలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేసుకున్నా..అశ్వద్దామ రెడ్డి నిర్ణయాల మేరకే సమ్మె కొనసాగింది. అది..ప్రభుత్వానికి రుచించ లేదు. అశ్వద్దామ రెడ్డి తీరు పై సీఎం ఆగ్రహంతో ఉన్నట్లుగా తాజా మీడియా సమావేశంలో స్పష్టమైంది. కార్మికులు సమ్మె విరమించి డ్యూటీల్లోకి వెళ్లటంతో..ఇక టీఎంయూ కార్యాలయానికి తాళాలు వేసి ఆర్టీసీ స్వాధీనం చేసుకుంది.
రిలీఫ్ డ్యూటీ రద్దు..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు ఎటువంటి షరతులు లేకుండా విధుల్లో చేరాలని ఆహ్వానించారు. కార్మిక సంఘాలను నమ్మితే రోడ్ల పాలవుతారని..తనను నమ్మితే సింగరేణి తరహాలో బోనస్ వచ్చేలా చేస్తానని స్పష్టం చేసారు. అదే సమయంలో తన పైన వ్యక్తిగతంగా ఆర్టీసీ జేఏసీ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూనే..వాటిని తాము పట్టించుకోమని స్పష్టం చేసారు. అయితే, అశ్వద్దామ రెడ్డి మాత్రం సీఎం తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామని చెబుతూనే.. యానియన్లను రద్దు చేయటం ఎవరికీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఇక, కార్మికులు విధుల్లో చేరటం వేగవంతం అయిన తరువాత ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇదే సమయంలో కార్మిక సంఘాల నేతలకు ఇప్పటి వరకు అమల్లో ఉన్న రిలీఫ్ డ్యూటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ డైరెక్టర్ విజిలెన్స్ రామచంద్రరావు..ఛీఫ్ పర్సనల్ మేనేజర్ కిరణ్ ఆదేశాలతో ఆర్టీసీ సిబ్బంది అశ్వధ్దామరెడ్డి నాయకత్వంలో ఉన్న తెలంగాణ మజ్డూర్ యూనియన్ కార్యాలయానికి తాళాలు వేసారు. ఆ కార్యాలయాన్ని ఆర్టీసీ అధికారులు తమ అధీనంలోకి తీసుకుంటున్నట్లుగా చెబుతూ..స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు దీని మీద అశ్వద్దామరెడ్డి.. టీఎంయూ నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి.












Click it and Unblock the Notifications