జగన్కు భారీ షాక్, సాక్షిలో ఇంటర్వ్యూ...: బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు సిబిఐ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసును ప్రభావితం చేసే విధంగా జగన్ ప్రవర్తిస్తున్నారని ఆ పిటిష
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసును ప్రభావితం చేసే విధంగా జగన్ ప్రవర్తిస్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొంది.
సిబిఐకి వ్యతిరేకంగా జగన్ ఛానెల్లో ఇంటర్వ్యూ ప్రసారం చేశారని సిబిఐ అందులో పేర్కొంది. దీనిపై న్యాయస్థానం జగన్కు సమన్లు జారీ చేసింది. 7వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
వైయస్ రాజశేఖర రెడ్డి మృతి అనంతరం జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైసిపిని స్థాపించారు. తన తండ్రి హయాంలో ఆయన భారీగా అక్రమాలకు పాల్పడ్డారని కేసు నమోదయింది. దీనినిపై సీబీఐ విచారణ, ఈడీ దర్యాఫ్తు జరుగుతున్నాయి.
ఆ తర్వాత ఆయన జైలుకు వెళ్లారు. దాదాపు సంవత్సరంన్నర జైలులో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది. విభజన అనంతరం.. జగన్ పార్టీ అయిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రధానంగా ఏపీకే పరిమితం అయింది.
ఆయన అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణ నెమ్మదిగా సాగుతోందని టిడిపి, తనపై అక్రమ కేసులు బనాయించారని జగన్, వైసిపి నేతలు ఆరోపిస్తుంటారు. ఈ ఆరోపణల విషయం ఎలా ఉన్నా.. నాలుగైదేళ్ల తర్వాత మళ్లీ జగన్ బెయిల్ అంశం తెరపైకి వచ్చింది.
సాక్షిలో సీబీఐకి వ్యతిరేకంగా కథనం వచ్చిందని, ఆయన దర్యాఫ్తును ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలని తాజాగా సీబీఐ కోర్టును ఆశ్రయించడం ఆయనకు పెద్ద దెబ్బ. దీంతో ఆయన మళ్లీ జైలుకు వెళ్తారా అనే చర్చ సాగుతోంది.