ఆదిభట్ల కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్; నిందితుడు నవీన్ రెడ్డి స్టేట్మెంట్లో సంచలన విషయాలు
ఆదిభట్ల కిడ్నాప్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో 100 మంది ఒక యువ డెంటల్ వైద్యురాలు ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించి, యువతిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో యువతి కిడ్నాప్ కు గురైన గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డి తో సహా ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేసులో కీలక ట్విస్ట్ నవీన్ రెడ్డి స్టేట్మెంట్
నవీన్ రెడ్డి నల్గొండ నుండి విజయవాడ వైపు పారిపోతున్న క్రమంలో నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఇక నల్గొండ జిల్లా మంచన్ పల్లి వద్ద వైశాలి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇరువురిని కలిపి ఒకే చోట విచారణ జరుపుతున్నారు. ఈ కేసు విచారణలో పోలీసులకు పలు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. నవీన్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ కేసును ఆసక్తికర మలుపు తిప్పింది.
నవీన్ రెడ్డికి వైశాలికి పెళ్లి?
తెలంగాణ రాష్ట్రం మొత్తం షాక్ కు గురయ్యే విధంగా వందమంది ఒక ఇంటిపై దాడి చేసి యువతిని కిడ్నాప్ చేసిన ఘటన, వైశాలి కుటుంబ సభ్యుల పై దాడి చేసి, ఆస్తుల ధ్వంసం చేసి బీభత్సం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నవీన్ రెడ్డి స్టేట్మెంట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. నవీన్ రెడ్డి స్టేట్మెంట్లో 2021 లోనే వైశాలి కి తనకు పెళ్లి జరిగిందని నవీన్ రెడ్డి పేర్కొన్నారు.
తామిద్దరం ప్రేమలో ఉన్నామని చెప్పిన నవీన్.. నిజమేనా?
బాపట్ల జిల్లా వలపర్ల ఆలయంలో నవీన్ రెడ్డి, వైశాలి ల పెళ్లి జరిగినట్టుగా నిందితుడు పేర్కొన్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం నవీన్ రెడ్డి వైశాలి వివాహం జరిగినట్టు గా నవీన్ రెడ్డి వెల్లడించారు.
2021 సంవత్సరం ఆగస్టు 4 వ తేదీన తాము వివాహం చేసుకున్నట్టు పేర్కొన్న నవీన్ రెడ్డి బీడీఎస్ కంప్లీట్ అయ్యేవరకూ పెళ్లి ఫోటోలు బయటకు రానివ్వకుండా ఉంచాలని వైశాలి కండిషన్ పెట్టిందని నవీన్ రెడ్డి తెలిపారు. అంతేకాదు 2021 జనవరి నుంచి తాము ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు, ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలుసు అన్నట్టుగా నవీన్ రెడ్డి పేర్కొన్నారు.
నవీన్ రెడ్డి వైశాలి వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలుసా ?
వైశాలి కుటుంబసభ్యులు నవీన్ రెడ్డిని బాగా వాడుకున్నారని కూడా పేర్కొన్నట్టు సమాచారం . వాళ్ళు తనతో డబ్బులు ఖర్చు పెట్టించేవారని ఆరోపించారు. బీడీఎస్ పూర్తయిన తర్వాత వైశాలిని తనకిచ్చి పెళ్లి చేస్తామని వారు మాట ఇచ్చారని, కానీ ఇప్పుడా మాట తప్పి వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేయడానికి రెడీ అయ్యారని ఆరోపించాడు.
తన డబ్బుతో వైశాలి కుటుంబ సభ్యులు జల్సాలు చేశారని, వైజాగ్, అరకు, కూర్గ్, మంగుళూరు, గోకర్ణ, గోవా, వంజంగి వంటి ప్రదేశాలకు వెళ్లారని నవీన్ రెడ్డి తెలిపాడు. ఇక వైశాలి పేరు మీద ఒక వోల్వో కారు, వైశాలి తండ్రికి రెండు కాఫీ షాప్ లను రిజిస్ట్రేషన్ చేయించినట్లు గా నవీన్ తన స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. నవీన్ స్టేట్మెంట్ పరిశీలిస్తే ఈ కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి.