'సైలెంట్ ఓటింగ్'.. ఆ పార్టీకి కలిసొచ్చిందా??
మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ప్రధాన పార్టీలన్నింటికీ అగ్నిపరీక్షలా నిలిచింది. గెలిచి తీరాల్సిన సందర్భాన్ని సృష్టించుకున్న భారతీయ జనతాపార్టీ అందుకు తగ్గట్లుగా తీవ్రంగా చెమటోడ్చింది. సాధారణ ఎన్నికలు జరిగే సమయానికి అధికార పార్టీకి ప్రజలు అనుకూలంగా ఉన్నారు అనే సందేశాన్ని పంపించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి సర్వశక్తులూ ఒడ్డింది. రాష్ట్రంలో అధికారం చేపట్టడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు పరీక్షగా మునుగోడును భావిస్తోంది.

భారీగా నమోదైన పోలింగ్ మాదే అంటున్న టీఆర్ఎస్?
ఈ తరహా రాజకీయ వాతావరణం మధ్య 93.13 శాతం పోలింగ్ నమోదవడాన్ని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు. సైలెంట్ ఓటింగ్ జరిగిందని, అది ఎవరికి అనుకూలంగా ఉంటుంది? ఎవరి కొంప ముంచుతుంది? అనే విషయమై విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎక్కువ పోలింగ్ నమోదైతే సాధారణ ఎన్నికల్లో అది అధికార పార్టీకి నష్టమని అంచనా వేస్తారు. అనేక ఫలితాలు గతంలో ఇదే విషయాన్ని స్పష్టం చెప్పాయి. కానీ ఇక్కడ ఉప ఎన్నిక జరగడంతో అలా భావించడానికి వీల్లేదు. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ పెరిగిన పోలింగ్ శాతం టీఆర్ఎస్ కుఅనుకూలమని, ఆ పార్టీ గెలుపు ఖాయమని తేల్చాయి. మెజారిటీ ఎంతనేది ఒక్కటే తేలాలని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

సైలెంట్ ఓటు మాదే అంటున్న బీజేపీ?
సైలెంట్ ఓటింగ్ తో కచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో బీజేపీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గానికి అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరుచేసి పనులు చేయించిందని, రెండు నెలలుగా మునుగోడులో ఉన్న వాతావరణం బీజేపీ వల్లేనని ప్రజలు భావిస్తున్నారని చెబుతున్నారు. తమ సమస్యలు కొన్నైనా తీరడానికి కారణం కోమటిరెడ్డి అనే విశ్వాసంతో ఇక్కడి ప్రజలున్నారని, అందుకే తమకే ఓటువేసి గెలిపిస్తారని ఆ పార్టీ నేతలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మెజారిటీ రాకపోయినా స్వల్పంగానైనా గట్టెక్కుతామనే నమ్మకంతో బీజేపీ ఉంది.

మహిళలు తమవైపే అంటున్న కాంగ్రెస్?
కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నిలబడటం తమకు అనుకూలంగా మారిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మహిళా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తడం కూడా కలిసివస్తుందని, తమ అభ్యర్థిని వారే గెలుస్తారనే ధీమాతో ఆ పార్టీ నేతలున్నారు. డబ్బులు పంచకపోయినా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న కసి ఓటర్లలో కనిపించిందని కాంగ్రెస్ శ్రేణులు వెల్లడించారు. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఎవరు ఎటువైపు అనేది రేపు తేలిపోనుంది.












Click it and Unblock the Notifications