సింగరేణితో ముడిపడిన నల్గొండ ఉపఎన్నిక: టిఆర్ఎస్ ప్లాన్ ఇదే
హైదరాబాద్: సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల ఫలితాల తర్వాత నల్గొండ ఉప ఎన్నికలపై టిఆర్ఎస్ నిర్ణయం తీసుకొనే అవకాశం కన్పిస్తోంది. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయం సాధిస్తే నల్గొండ ఉప ఎన్నికలకు టిఆర్ఎస్ వెంటనే సిద్దం కానున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతికూల ఫలితం వస్తే నల్గొండ ఉఫ ఎన్నికపై ఆలోచించే అవకాశాలు లేకపోలేదు.
సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించేలా టిఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి కార్మికసంఘాలను చావుదెబ్బతీసేలా టిఆర్ఎస్ పావులు కదుపుతోంది.
ఎన్నికలు: 2019 ఎన్నికల్లో సింగరేణి తరహ ప్రయోగం?
టిఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని దెబ్బతీసేందుకు విపక్షాలు ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎఐటీయూసీ కార్మిక సంఘానికి సిపిఐ, కాంగ్రెస్, టిడిపిలు మద్దతుగా నిలిచాయి.
ఓట్ల చీలికను నివారించేందుకుగాను విపక్షాలు ఈ ప్రయోగాన్ని సింగరేణి ఎన్నికల్లో చేశాయి. ఈ ప్రయోగం సక్సెస్ అయితే 2019 ఎన్నికల్లో కూడ ఇదే తరహ ప్రయోగాలన్ని అమలు చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ప్రత్యేక మేనిఫెస్టో విడుదలకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సన్నాహలు?
సింగరేణి కార్మికసంఘం గుర్తింపు ఎన్నికల్లో ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసేందుకు తెలంగాణ బొగ్గు గని కార్మకి సంఘం సన్నాహలు చేస్తోంది. సింగరేణి కార్మికులకు ఏ రకమైన ప్రయోజనాలను కల్పించనున్నామో ఆ మేనిఫెస్టోలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వివరించనుంది.సాధారణ ఎన్నికలను తలదిన్నేరీతిలో రాజకీయపార్టీలు ఈ ఎన్నికలను తీసుకొన్నాయి.
50 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపనున్న సింగరేణి కార్మికులు
తెలంగాణ రాష్ట్రంలోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు తీవ్ర ప్రభావాన్ని చూపనున్నారు. గత ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులు టిఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించారని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.దీంతో టిఆర్ఎస్కు అనుకూలమైన ఫలితాలు వచ్చాయని అభిప్రాయపడుతున్నారు. అయితే మరోవైపు సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు కూడ సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.
నల్గొండ ఉప ఎన్నికకు సింగరేణి ఎన్నికలతో లింక్
సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధిస్తే నల్గొండ ఉప ఎన్నికకు వెంటనే సిద్దం కావాలని టిఆర్ఎస్ భావిస్తోంది.సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో విపక్షాలు కూటమిగా ఏర్పడి పోటీచేయడంతో ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది.అయితే ఈ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా వస్తే వెంటనే నల్గొండ పార్లమెంట్ స్థానానికి కూడ ఉపఎన్నికలకు వెళ్లాలనే యోచనలో టిఆర్ఎస్ ఉంది.ఆ ఎన్నికల్లో కూడ విజయం సాధించడం ద్వారా విపక్షాల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.
వారసత్వ ఉద్యోగాలపై
సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాల విషయమై పెద్ద చర్చ సాగుతోంది. వారసత్వ ఉద్యోగాలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నప్పటికీ కోర్టు కేసుల కారణంగా ఉద్యోగాలను ఇవ్వలేని పరిస్థితి నెలకొందని తెలంగాణ బొగ్గు గని కార్మికసంఘం ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. విపక్ష పార్టీలకు చెందిన కార్మిక సంఘాలే వారసరత్వ ఉద్యోగాలు రాకుండా అడ్డుపడుతున్నాయని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆరోపిస్తోంది.అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఏ రకంగా సింగరేణి కార్మికులకు హమీలు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హమీలను ఎలా వమ్ముచేశారనే విషయమై విపక్షాలు ప్రచారం నిర్వహిస్తున్నాయి.