జిల్లాలలో వర్షాల వల్ల ఒక్క ప్రాణ నష్టం కూడా జరగొద్దు; అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం
తెలంగాణ రాష్ట్రంలో గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా జిల్లాలలో ఒక ప్రాణ నష్టం కూడా జరగకూడదని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన భారీ వర్షాల దృష్ట్యా జెడ్పీ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు మున్సిపల్, నీటిపారుదల, ఇంజినీరింగ్ శాఖలు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అధికారులు ప్రాణ నష్టం,ఆస్తి నష్టం జరగకుండా కాపాడాలి : మంత్రి కేటీఆర్
జూలైలో అత్యధిక వర్షపాతం నమోదైందని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం జిల్లాలో పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్లో సాధారణం కంటే 450 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్తినష్టం జరగకుండా జిల్లా అధికారులు చొరవ చూపాలన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన సమయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు .
శిధిలావస్థలో ఉన్న ఇళ్ళను ఖాళీ చేయించాలి
నిర్మాణ స్థలాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో 666 చెరువుల పరిస్థితి సురక్షితంగా ఉందని జిల్లా నీటిపారుదల అధికారి అమరేందర్రెడ్డి మంత్రికి వివరించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించాలని, సిరిసిల్ల పట్టణంలో గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రమాదకరమైన బోరు బావులు, బహిరంగ బావులను గుర్తించి పూడ్చివేయాలని కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణంలో రోడ్లపై నిలిచిపోయిన వరద నీరు త్వరగా మళ్లించేలా చూడాలని సూచించారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలి
గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. మానేరు, ములవాగు, నక్కవాగు పొంగిపొర్లుతున్నందున గ్రామస్తులను అప్రమత్తం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలని, మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసే ముందు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణనష్టం జరగకుండా చూడాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
మిడ్ మానేరు జలాశయం విషయంలో అప్రమత్తంగా ఉండాలి
బోయినిపెల్లి, ఎల్లంతకుంట మండలాల్లోని మిడ్మానేరు జలాశయానికి వచ్చే ప్రజలను నియంత్రించాలని సూచించారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టులపై నోటీసులు జారీ చేయాలి. అప్పటికీ స్పందన రాకపోతే కాంట్రాక్టులను బ్లాక్ లిస్టులో పెట్టాలని, మిషన్ భగీరథ నీటి కలుషితాన్ని నివారించేందుకు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి నమూనాల సంఖ్య సామర్థ్యాన్ని పెంచాలని, జిల్లాలో 1,30,000 కనెక్షన్లకు గాను 350 నమూనాలను మాత్రమే పరీక్షించడం పట్ల కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో మిషన్ భగీరథ కనెక్షన్ల కోసం నమూనాల పరీక్షలను పెంచాలని మంత్రి తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు ప్రాణాలు రక్షించడం కోసం అన్ని రకాల చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.