వారే కీలకం: నయీంతో నేతల లింక్పై సస్పెన్స్, సామ సంజీవరెడ్డి అరెస్ట్!
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో పోలీసులు ఇప్పటి వరకు 50 మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో నయీం కుటుంబ సభ్యులు, అనుచరులే ఉన్నారు. నయీం కేసులో ఐదుగురు కీలక నిందితులుగా ఉన్నారు. వారు మాత్రం ఇంకా దొరకలేదు.
మరో కోణం: రూ.200 కోట్ల వెంచర్ వెనుక నయీం, ఎండీతో లింక్
ఆ ఐదుగురు కీలక నిందితులు దొరికితేనే.. కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. నయీంకు కొందరు రాజకీయ నాయకులు, కొందరు పోలీసుల అధికారులతో సంబంధాలు ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇంకా సస్పెన్స్గానే ఉంది.
ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) అధికారులు నయీంతో సంబంధాలున్న నాయకులు, పోలీసు అధికారుల పైన స్పందించలేదని అంటున్నారు. కేసు ఇంకా విచారణలో ఉన్నందున వారు ఇంకా ఆ అంశం గురించి మాట్లాడటం లేదు.
అమ్మాయిలతో నయీం అక్కడా జల్సా, ఆమెపై మనసుపడ్డ రిటైర్డ్ అధికారి!
ఇప్పటికే దొరికిన నిందితులతో పాటు, కీలక నిందితులు అరెస్టైతే వారి నుంచి పోలీసులు సమాచారం సేకరించనున్నారు. ఆ తర్వాతే రాజకీయ నాయకులు, అధికారులతో సంబంధాలు తేలనుందని అంటున్నారు. ఇప్పటికే డైరీలో పలువురు పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. కీలక నిందితుల్లో శేషన్న ఉన్నాడు. పోలీసులు అతని కోసం కూ డా తీవ్రంగా గాలిస్తున్నారు.
పాశం శ్రీనుకు కస్టడీ
నయీం అనుచరుడు పాశం శ్రీనుకు భువనగిరి న్యాయస్థానం మూడు రోజుల పోలీసు కస్టడీ ఇచ్చింది. నయీం కేసులో మరిన్ని వివరాలు సేకరించారని, అతనిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు మూడు రోజుల పాటు అనుమతిచ్చింది.
పోలీసుల అదుపులో సామ సంజీవరెడ్డి
నయీం అనుచరుడు సామ సంజీవ రెడ్డిని ప్రత్యేక దర్యాఫ్తు బృందం అధికారులు మంగళవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. పటాన్ చెరువులోని ఓ హోటల్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నయీం ఎన్కౌంటర్ అనంతరం ఆయన ఇంటి పైన పోలీసులు దాడి చేయగా, అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. నయీం వేల కోట్ల ఆస్తులకు ఇతను బినామీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.