తెలంగాణా బీజేపీ కీలకనేతలకు సిట్ నోటీసులు సిద్ధం? బండి అనుచరుడి విచారణతో నేతల్లో గుబులు!!
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బీజేపీ నేతలను టెన్షన్ పెడుతుందా? బీజేపీలోని కీలక నేతలకు సిట్ నోటీసులు జారీ చేయడానికి సిద్ధం అవుతుందా? వారి మెడకు ఉచ్చు బిగించేలా ప్రయత్నం చేస్తుందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు... సిట్ దూకుడు
తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అనుచరుడు న్యాయవాది శ్రీనివాస్ ను సుదీర్ఘంగా ఎనిమిది గంటలపాటు విచారించిన సిట్ బృందం ఈ కేసులో పలు కీలక ఆధారాలను సేకరిస్తుంది. ఇక శ్రీనివాస్ ఇచ్చిన సమాచారంతో బీజేపీ లోని కొందరు కీలక నాయకులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో అసలు శ్రీనివాస్ ఎవరి పేర్లు చెప్పారు? ఏ విషయాలు వెల్లడించారు అన్నది బిజెపి నేతలకు ఆందోళన కలిగిస్తుంది.

బీజేపీ జాతీయ కీలక నాయకులకు నోటీసులు
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి లను ప్రలోభపెట్టి బిజెపిలో చేర్చుకోవాలనే ప్రయత్నం చేశారని ఆరోపణలతో రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారణ జరపటానికి సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణా ప్రభుత్వం. అయితే ఈ కేసులో ఎవరెవరికి సంబంధాలు ఉన్న అంశంపై నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించిన సిట్ అధికారులు బిజెపి జాతీయ, కీలక నాయకులకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.

నోటీసులు ఇచ్చినా హాజరుకాని నేతలు
ఇప్పటికే బీజేపీ నేత బిల్ సంతోష్ కు నోటీసులు జారీ చేసినప్పటికీ సిట్ ముందుకు ఆయన రాలేదు. ఇక సిట్ నోటీసులు జారీ చేసిన తుషార్, జగ్గు స్వామి కూడా హాజరు కాలేదు. దీంతో వారిపై లీగల్ ఒపీనియన్ తీసుకుని, తర్వాత ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్ హెచ్ ఓ ఆధ్వర్యంలో సిట్ విచారణ కొనసాగుతుంది.

ఫ్లైట్ టికెట్ల కొనుగోలుపై శ్రీనివాస్ ను ప్రశ్నించిన సిట్
ఇదిలా ఉంటే శ్రీనివాస్ ను విచారించిన సిట్ బృందం ముఖ్యంగా సింహయాజీ స్వామి కి ఫ్లైట్ టికెట్లు కొనుగోలు పై శ్రీనివాస్ ను ప్రశ్నించింది. అక్టోబర్ 26 వ తేదీన తిరుపతి నుండి హైదరాబాద్ కు సింహయాజీ స్వామికి టికెట్లు ఎందుకు బుక్ చేశారని ఆయనను విచారించారు. ఇక శ్రీనివాస్ కాల్ డేటా, ఆయన వాట్సప్ మెసేజ్లను ముందు పెట్టి అనేక ప్రశ్నలను సంధించింది సిట్. అయితే శ్రీనివాస్ తాను సింహయాజి స్వామితో హోమం, ప్రత్యేక పూజలు చేయించడం కోసం టికెట్ బుక్ చేశానని సిట్ అధికారులకు చెప్పినట్టు సమాచారం.

మరికొంత మందికి సిట్ నోటీసులు.. బీజేపీ నేతల్లో గుబులు
ఏది ఏమైనా కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారుల బృందం సేకరించిన కాల్ డేటా, వాట్సాప్ మెసేజ్ ల ఆధారంగా ఈ కేసులో మరికొంతమందిని విచారించడానికి సిట్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరికి నోటీసులు జారీ చేస్తారు? తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక తాజా పరిణామాలతో బీజేపీ నేతల్లో గుబులు పట్టుకుంది.












Click it and Unblock the Notifications