మా పెళ్లి చేసింది కేసీఆరే... భావోద్వేగానికి లోనైన దుబ్బాక అభ్యర్థి సోలిపేట సుజాత..
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా తన పేరు ప్రకటించినందుకు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ తమ కుటుంబానికి ఎప్పుడూ అండగా నిలుస్తూ వచ్చారని చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం(అక్టోబర్ 6) మంత్రి హరీశ్ రావు నేత్రుత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుజాత ఇంటికెళ్లి ఆమెను పరామర్శించారు.
కేసీఆర్ ఎప్పుడూ అండగా నిలిచారని...
ఈ సందర్భంగా నేతలు సోలిపేట రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సోలిపేట సుజాత మాట్లాడుతూ... కేసీఆరే తమ వివాహం చేశారని... తమ పిల్లల పెళ్లిళ్లు కూడా ఆయనే చేశారని గుర్తుచేసుకున్నారు. మొదటినుంచి తమ కుటుంబానికి అండగా నిలుస్తూ వచ్చిన ఆయన రామలింగారెడ్డి చనిపోయినప్పుడు కూడా తమ కుటుంబానికి అండగా నిలిచారన్నారు.రామలింగారెడ్డి లాగే తాను కూడా ప్రజలకు అందుబాటులో ఉంటానని... నియోజకవర్గ అభివృద్ది కోసం కృషి చేస్తానని సుజాత పేర్కొన్నారు.
జాతీయ పార్టీలతో ఒరిగిందేమీ లేదు...
టీఆర్ఎస్లో సుజాత గెలుపు కోసం మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంగళవారం పలువురు నేతలు సిద్దిపేటలో ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న సోలిపేట సుజాతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రైతుల గురించి బీజేపీ ఎన్నడూ పట్టించుకోలేదని... జాతీయ పార్టీలతో తెలంగాణతో ఒరిగిందేమీ లేదని అన్నారు. కొత్త వ్యవసాయ బిల్లులతో బీజేపీ రైతుల పొట్ట కొడుతోందని ఆరోపించారు.
కిషన్ రెడ్డి,జానారెడ్డి కూడా లబ్దిదారులే...
రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడం ఎన్డీయే ప్రభుత్వంలోని మంత్రులకే న్యాయంగా అనిపించలేదని... అందుకే ఓ కేంద్రమంత్రి రాజీనామా చేశారని చెప్పారు. మనదేశంలోనే 280లక్షల టన్నుల మక్కలు ఉత్పత్తి అవుతుంటే... విదేశాల నుంచి మక్కలు దిగుమతి చేసుకోవడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయని... కేసీఆర్ ప్రతీ అడుగు రైతుల కోసమేనని హరీశ్ రావు స్పష్టం చేశారు.సంక్షేమంలో దూసుకుపోతున్న తెలంగాణను బీజేపీ అణదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్కు చెందిన మాజీ మంత్రి జానారెడ్డిలు కూడా తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులేనని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా సంక్షేమం,అభివృద్ది చేపట్టిన ఘటనత కేవలం కేసీఆర్కే దక్కుతుందన్నారు.