ఎర్రబెల్లి బ్యాచ్ లేఖ: ఇది మూడో సారి, స్పీకర్ ఏం చేస్తారు?
హైదరాబాద్: పది మంది టిడిపి ఎమ్మెల్యేలు తమను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభాపక్షంలో విలీనం చేయాలని కోరుతూ స్పీకర్కు లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విలీనం సాధ్యం కాదని టిడిపి వాదిస్తుండగా, సాధ్యమేనని అధికార పక్షం ధీమా వ్యక్తం చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో పార్టీల విలీనం ఇది మొదటి సారేమీ కాదు. ఇది ముచ్చటగా మూడవ సారి. తొలుత బిఎస్పికి చెందిన ఇంద్రకరణ్రెడ్డి, కోనేరు కోనప్ప తమ పార్టీ శాసనసభాపక్షాన్ని టిఆర్ఎస్లోవిలీనం చేస్తున్నట్టు తీర్మానం చేసి స్పీకర్కు అందించారు.
ఈ మేరకు స్పీకర్ విలీనం జరిగినట్టు బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో బిఎస్పి ప్రభావం లేకపోవడం, ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు విలీనం కావడంతో ఈ అంశం సమస్యగా మారలేదు. ఆ తరవాత శాసన మండలిలో టిడిపి సభ్యులు విలీనం అయ్యారు. మండలిలో ఏడుగురు టిడిపి సభ్యులు ఉంటే వారిలో ఐదుగురు తాము టిఆర్ఎస్లో విలీనం అవుతున్నట్టు స్పీకర్కు లేఖ ఇచ్చారు. వీరి విలీనాన్ని గుర్తిస్తూ స్పీకర్ బులెటిన్ విడుదల చేశారు.
ఇది జరిగి ఏడాది గడిచింది. ఇప్పుడు సరిగ్గా ఇదే విధానంలో టిడిపి శాసన సభ్యులు పదిమంది టిఆర్ఎస్లో విలీనం కోసం తీర్మానం చేసి స్పీకర్కు లేఖ ఇచ్చారు. నిబంధనల విషయంలో మండలికి, శాసనసభకూ తేడా లేనందున మండలిలో టిడిపి సభ్యులు విలీనమైనట్టే సభలోనూ విలీనమయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని టిడిపి చెబుతోంది. దీంతో విలీన వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
నిరుడు మండలిలో జరిగిన విలీనంపై సైతం ఇప్పుడు కోర్టుకు వెళతామని టిడిపి ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ప్రకటించారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ నాలుగో పేరా ప్రకారం తాము టిఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నామని, స్పీకర్ తీసుకునే నిర్ణయమే అంతిమమని, ఆ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరని అధికార పక్షం చెబుతోంది.
కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో స్పీకర్ మధుసూదనా చారి న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. ఎర్రబెల్లి ఇచ్చిన లేఖపై ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.