ప్రిన్సిపల్ తిట్టాడని.. భవనంపైనుంచి దూకిన టెన్త్ విద్యార్థి
Hyderabad: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ మందలించాడని తీవ్రమనస్తాపానికి గురైన ఓ పదవ తరగతి విద్యార్థి.. పాఠశాల భవనంపైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడు భవనంపైనుంచి దూకిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బుధవారం సాయంత్రం బాధితుడు నీరజ్, మరో విద్యార్థి స్కూల్ భవనం సెకండ్ ఫ్లోర్లోని బాల్కనీలో మాట్లాడుకుంటుండగా.. వారిని తన గదికి పిలిపించుకున్న ప్రిన్సపల్ మందలించడం వల్లే తమ కుమారుడు ప్రాణాలు తీసుకున్నాడని అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

ప్రిన్సిపల్ మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నీరజ్.. టాయిలెట్ కోసం వెళ్తున్నట్లు చెప్పి.. భవనంపైనుంచి దూకాడని తెలిపారు. భవనంపైనుంచి దూకిన నీరజ్.. తీవ్రగాయాలు కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గమనించిన వెంనటే నీరజ్ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నీరజ్ మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అతని కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. కాగా, మృతి చెందిన నీరజ్.. బీజేపీ షాద్ నగర్ పట్టణ అధ్యక్షుడు హరిభూషణ్ కుమారుడిగా గుర్తించారు.
హాస్టల్ భవనంపైనుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలి సిద్ధినగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో 22 ఏళ్ల రితోజి బసు ఉంటోంది. ఆమె హాస్టల్ భవనంపైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications