దారుణం: విద్యార్ధుల మధ్య ఘర్షణ, పదో తరగతి విద్యార్థి మృతి (పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని కింగ్ కోఠిలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో దారుణం జరిగింది. విద్యార్ధుల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి మృతిచెందాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ ఘర్షణలో పదో తరగతి విద్యార్థి సిద్ధిఖీ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సిద్ధిఖీ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు నారాయణగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
బలమైన దెబ్బలు తగలడం వల్లే విద్యార్ధి సిద్దిఖీ మృతిచెందినట్లు సెంట్రల్జోన్ డీసీపీ కమలాసన్రెడ్డి వెల్లడించారు. నగరంలోని కింగ్కోఠిలో గల సెయింట్ జోసెఫ్ పాఠశాలలో నిన్న సాయంత్రం షరాయల్, సిద్దిఖీ అనే ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ చోటుచేసుకుందన్నారు.
పాఠశాలలో ఆకస్మికంగానే ఈ ఘటన జరిగినట్లు డీసీపీ తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా పాఠాశాలలోని సీసీ కెమెరాల్లో దృశ్యాలను పరిశీలిస్తున్నారు. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘర్షణకు దారి తీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.