ఓయులో అర్ధరాత్రి ఉద్రిక్తం: గదులకు నిప్పు, పరుగు
హైదరాబాద్: విద్యార్థి సంఘాల మధ్య చిన్న వివాదం పెద్ద ఘర్షణకు దారి తీసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పైన కొద్ది రోజులుగా ఓయులో జరుగుతున్న ఆందోళనలో భాగంగా బుధవారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు ర్యాలీలో పాల్గొనక పోవడాన్ని గమనించిన మిగిలిన విద్యార్థులు ప్రశ్నించారు. దీంతో పరస్పరం దూషించుకున్నారు.
కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘాల నేతలు జోక్యం చేసుకొని గొడవను సద్దుమణిగేలా చేశారు. బుధవారం రాత్రి హాస్టళ్ల పైన ఓ విద్యార్థి సంఘానికి చెందిన వారు దాడి చేసి అక్కడి సామాగ్రిని ధ్వంసం చేసి పీజీ హాస్టల్లో 24, 64 నెంబరు గదులకు నిప్పంటించాడు. ఓ హాస్టల్ విద్యార్థి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతనిని ఆసుపత్రికి తరలించారు. పరస్పరం విద్యార్థి సంఘాల వారు దాడులకు పాల్పడ్డారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

రూం నెంబర్ 62ను మంటలు పూర్తిగా కమ్మేయడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక దళం సహాయంతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అర్ధరాత్రి వరకు విద్యార్థులు హాస్టళ్ల వద్ద గుంపులుగా చేరి నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి చేజారిపోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అదనపు బలగాలను రంగంలోకి దించారు. హాస్టల్ గదుల నుంచి భయటకు రావోద్దంటూ విద్యార్ధులకు హెచ్చరికలు జారీ చేశారు.
కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర

ఇదిలా ఉంటే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తున్న ఓయూ విద్యార్థులు బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. తొలుత భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుంచి ఓయూ పోలీసు స్టేషన్ వరకు కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఓయూ పీఎస్ వద్దే కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విద్యార్థులు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications