తెలంగాణ ప్రభుత్వంపై సురేష్ బాబు ఇలా: తలసానికి వేణు మాధవ్ ఫిర్యాదు
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కాగా, సినీరంగ ప్రముఖులు, వాహన యజమానుల మధ్య నెలకొన్న వివాదం సమసిపోయింది.
గత మూడు రోజులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో జరుగుతున్న చర్చలు గురువారం సఫలమయ్యాయి. డిమాండ్కు తగ్గట్లుగానే వాహనాలు తీసుకుని అద్దె చెల్లిస్తామని సినీప్రముఖులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు సురేష్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సినీరంగ ప్రోత్సాహక ప్రభుత్వమని అన్నారు. ఇతర రాష్ట్రాల సినిమాల చిత్రీకరణలు కూడా ఇక్కడ జరుగుతున్నాయని సురేష్ బాబు తెలిపారు.
వేణు మాధవ్ ఫిర్యాదు
ప్రముఖ తెలుగు హాస్యనటుడు వేణుమాధవ్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తుండడం పట్ల సదరు నటుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
తనపై కొందరు నెటిజన్లు, కొన్ని వెబ్సైట్లు చేస్తోన్న అసత్య ప్రచారం పట్ల ఇటీవలే హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వేణు మాధవ్.. గురువారం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి మరోసారి ఫిర్యాదు చేశాడు.
తనకు అనేక వ్యాధులున్నాయంటూ, తాను చనిపోయినట్లు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. నిర్మాతల మండలి సభ్యులు సురేష్ బాబు, దిల్ రాజుతో కలిసి వేణుమాధవ్ మంత్రి తలసానికి ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.