మంచిర్యాల ఆరుగురి సజీవదహనం కేసులో అనుమానాలు.. రంగంలోకి 16 పోలీస్ బృందాలు
మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంచిర్యాల జిల్లా వెంకటాపూర్ లో ఆరుగురి సజీవ దహనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాద ఘటన యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని, ఎవరో కావాలని పక్కా ప్లాన్ తో ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇల్లు దగ్ధం ఘటన...అనేక అనుమానాలు
ఈ సంఘటనలో మృతి చెందిన వారు 50 సంవత్సరాల శివయ్య, 45 సంవత్సరాల పద్మ, 23 ఏళ్ల మౌనిక, శాంతయ్య, చిన్నారి హిమబిందు, స్వీటీ లుగా పోలీసులు గుర్తించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి గ్రామంలో ఇల్లు దగ్ధమైన ఘటనలో ఆరుగురు సజీవదహనమైన కేసులో అగ్ని ప్రమాదం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల జరగలేదని విద్యుత్ అధికారులు తేల్చిచెప్పారు. ఇక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన దాఖలాలు కూడా లేవని అధికారులు గుర్తించారు.

ఇంటి దగ్గర పెట్రోల్ డబ్బాలు.. కారంపొడి
ఈ కేసులో ప్రమాదానికి గురైన ఇంటికి కొద్ది దూరంలో రెండు క్యాన్లు కనిపించడం, వాటిలో పెట్రోల్ తెచ్చినట్టుగా గుర్తించడం పలు అనుమానాలకు తావిస్తోంది. గంటన్నర సమయంలోనే ఇల్లు మొత్తం కాలి బూడిద కాగా, మంటలు ఒకేసారి ఇంటి మొత్తానికి ఎలా వ్యాప్తి చెందాయి అన్న దానిపైన ప్రస్తుతం అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాదు అక్కడ ఒక ఆటోలో కారం పొడిని కూడా గుర్తించిన అధికారులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

16 టీం లను ఏర్పాటు చేసి పోలీసుల విచారణ
ఇక మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపించాలని మృతుడు శివయ్య కుమారుడు ఫిర్యాదు చేశాడు. శివయ్య కుమారుడు ప్రేమ వివాహం చేసుకుని తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు. ఇక శివయ్య కుటుంబ సభ్యుల మరణంపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్టుగా పోలీసులు వెల్లడించారు.
ఈ కేసు విచారణ కోసం 16 టీమ్లను ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన సింగరేణి కార్మికుడు శాంతయ్య కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మంచిర్యాల డిసిపి అఖిల్ మహాజన్, ఏసీపీ తిరుపతి రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications