హీరోయిన్ స్వాతి మిస్సింగ్: శ్రీనివాస్ రెడ్డి తీసుకెళ్లారని ఫిర్యాదు, పరస్పరం దాడి?
హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సినిమా హీరోయిన్ స్వాతి రెడ్డి మిస్సింగ్ అయిందంటూ ఫిర్యాదు అందింది. స్వాతి రెడ్డి తల్లి నాగేంద్రమ్మ ఫిర్యాదు చేశారు. స్వాతి రెడ్డి 'లవ్' సినిమాలో నటించింది.
తన కూతురు స్వాతి రెడ్డిని గుంటూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి మాయ మాటలు చెప్పి తీసుకు వెళ్లిపోయారని తల్లి తన ఫిర్యాదులో ఆరోపించారు. శ్రీనివాస్ రెడ్డికి గతంలోనే పెళ్లయిందని చెప్పారు. స్వాతి రెడ్డి ఇంట్లోని నగదు, నగలను తీసుకు వెళ్లిందని తల్లి చెప్పారు. దీంతో స్వాతి రెడ్డి స్టేషన్ వచ్చారు.
తాను ఎక్కడికీ పోలేదని, ఇష్టపూర్వకంగానే ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు కూతురు బంజారాహిల్స్ పోలీసులకు తెలిపారు. తల్లికి, తనకు ఆర్థిక లావాదేవీల్లో గొడవలు ఉన్నాయని, అయితే ఇప్పుడు అన్ని సమస్యలు సమసిపోయాయని చెప్పారు.
తమ మధ్య ఎలాంటి వివాధాలు లేవని చెప్పారు. తాను సంపాదిస్తున్న డబ్బుపై తప్ప తనపై తన తల్లి నాగేంద్రమ్మకు, సోదరుడికి ప్రేమ లేదని ఆమె చెబుతున్నారు.
తనకు కూతురంటే భయమని నాగేంద్రమ్మ చెప్పిన మాటలు బూటకమని చెప్పారు. తన కథ, సినిమాల్లో ఛాన్సుల కోసం పడ్డ కష్టాలు విజయవాడలో పది మందికీ తెలుసునని, హైదరాబాదులో పదిమందికీ తెలుసునన్నారు. తన సోదరుడికి సొంత సంపాదనతో పెళ్లి చేశానని చెప్పారు.
మరోవైపు, ఫిర్యాదు చేసిన తల్లితో పోలీస్ స్టేషన్లోనే ఆమె ఘర్షణకు దిగారు. తల్లీకూతుళ్లు పరస్పరం దాడి చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది.
తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై తల్లీకూతుళ్లకు పోలీసులు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ఇరువురి మధ్య రాజీ కుదిరిందని తెలుస్తోంది.