జగన్ను టార్గెట్ చేయడానికి...: చంద్రబాబుపై తలసాని ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వలేక ఇబ్బంది పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ను టార్గెట్ చేయడానికి మొత్తం మంత్రివర్గాన్ని వాడుకున్నరని ఆయన అన్నారు.
ఎపి రాజధాని అమరావతి శంకుస్థాపనకు జగన్ ఒక్కరే కాదు, ఇతర ప్రతిపక్షాల పార్టీ నేతలెవరూ హాజరు కాలేదని ఆయన గుర్తు చేసారు. చంద్రబాబు విదేశాలు తిరుగుతున్నప్పటికీ పెట్టుబడులైతే రావడం లేదని అన్నారు. పారిశ్రామికవేత్తలెవరూ చంద్రబాబును నమ్మడం లేదని ఆయన అన్నారు.

పెట్టుబడులు రాకపోవడమే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఆ ప్రాంతానికి చెందిన తన మిత్రులు తనకు చెబుతున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మాల, మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని ఆయన ఆరోపించారు.
ఇప్పుడు ఎపిలో మరోసారి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన చంద్రబాబును నిందించారు. కాపులు, బీసీల మధ్య పెడుతున్న చిచ్చు తిరిగి చంద్రబాబు మెడకే చుట్టుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. హామీలు నెరరవేర్చకపోవడం వల్లనే ఎపిలో కాపులు ఉద్యమ బాట పట్టారని ఆయనఅన్నారు. బడ్జెట్లో కాపులకు కేటాయించిన వేయి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారా అనేది అనుమానమేనని తలసాని అన్నారు.












Click it and Unblock the Notifications