తెలంగాణ కొత్త కేసులు ఆరున్నర వేలు: 20 మంది మృత్యువాత: జిల్లాలవారీ రిపోర్ట్ ఇదే
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోంది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా కొత్త కేసులు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. ప్రజలను హడలెత్తిస్తోన్నాయి. అధికార యంత్రాంగాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. రోజువారీ కేసుల్లో కనిపిస్తోన్న వేగం.. ఇదివరెప్పుడూ లేదు. అనూహ్య పెరుగుదల నమోదవుతోంది. సెకెండ్ వేవ్ తీవ్రత అన్ని జిల్లాల్లోనూ నెలకొంది. కొత్తగా రోజువారీ కేసుల సంఖ్య ఆరున్నర వేలను దాటింది. యాక్టివ్ కేసులు 50 వేలకు చేరువ అయ్యాయి. కరోనా మరణాల్లోనూ అదే స్పీడ్ నెలకొనడం ఆందోళనకరంగా మారింది.

ఆరున్నర వేలకు పైగా..
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,542 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 20 మంది మరణించారు. 2,887 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,67901కి చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 3,19,537 మంది ఉన్నారు. 1,876 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న కేసుల్లో ఒక్కసారిగా భారీ పెరుగుదల నమోదైంది. తాజా బులెటిన్ ప్రకారం.. 46,488 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

జిల్లాల్లో కల్లోలం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. కొత్తగా 898 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీతో పాటు పలు జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంటోంది. గ్రేటర్కు ఆనుకుని ఉన్న మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో 500లకు పైగా చొప్పన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది జిల్లాల్లో 200లకకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఉత్తర తెలంగాణలో కరోనా హాట్స్పాట్గా మారిన నిజామాబాద్లో అదే ఉధృతి కొనసాగుతోంది. అక్కడ 427 కేసులు రికార్డయ్యాయి.

జిల్లాలవారీగా..
ఆదిలాబాద్-98, భద్రాద్రి కొత్తగూడెం-128, జగిత్యాల-230, జనగామ-84, జయశంకర్ భూపాలపల్లి-32, జోగుళాంబ గద్వాల-48, కామారెడ్డి-235, కరీంనగర్-203, ఖమ్మం-246, కొమరం భీమ్ ఆసిఫాబాద్-37, మహబూబ్నగర్-263, మహబూబాబాద్-64, మంచిర్యాల-176, మెదక్-131, మేడ్చల్ మల్కాజ్గిరి-570, ములుగు-42, నాగర్ కర్నూల్-131, నల్లగొండ-285, నారాయణ్పేట్-37, నిర్మల్-143, నిజామాబాద్-427, పెద్దపల్లి-96, రాజన్న సిరిసిల్ల-124, రంగారెడ్డి-532, సంగారెడ్డి-320, సిద్ధిపేట్-147, సూర్యాపేట్-130, వికారాబాాద్-135, వనపర్తి-81, వరంగల్ రూరల్-85, వరంగల్ అర్బన్-244, యాదాద్రి భువనగిరి-140 కేసులు నమోదు అయ్యాయి.

జోరుగా టెస్టింగులు..
తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 1,30,105 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన పరీక్షలు 49.9 శాతం కాగా.. మిగిలినవీ ప్రైవేటు హాస్పిటల్స్లో నమోదయ్యాయి. కొత్త వాటితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 1,20,73,371గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల జనాభాకు 3,24,371 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications