నోటుకు ఓటు: రేవంత్ రెడ్డి అనుచరులకు ఎసిబి నోటీసులు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) మరో ఇద్దరికి బుధవారంనాడు నోటీసులు జారీ చేసింది. నోటుకు ఓటు కేసులో నిందితుడు, రేవంత్ రెడ్డి అనుచరులు సైదులుకు, అల్లూరి నారాయణ రాజుకు ఎసిబి నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే రేవంత్ రెడ్డి డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి ఎసిబి పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ తుది నివేదిక ఎసిబి కోర్టుకు చేరనుంది. కేసులో కీలక సాక్ష్యాలుగా భావిస్తున్న ఆడియో, వీడియో టేపులను పరిశీలించిన ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ తన ప్రాథమిక నివేదికను గతంలోనే కోర్టుకు సమర్పించింది.
కాగా, వాటిపై మరింతగా పరిశోధన చేసిన లాబొరేటరీ సమగ్ర వివరాలతో తుది నివేదికను కోర్టుకు సమర్పించనుంది. ఈ నివేదిక అధారంగా ఎసిబి అధికారులు దర్యాప్తులో వేగం పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరింత మందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
ఏసీబీ అధికారులు సెల్ఫోన్ కాల్స్ ఆధారంగా ఇప్పటికే నలుగురు తెలుగు యువత నేతలు ప్రదీప్, పుల్లారావు యాదవ్, సుధీర్, మనోజ్లతోపాటు ఎమ్మెల్యే రేవంత్రెడ్డి డ్రైవర్ రాఘవేందర్ రెడ్డిలను రెండు రోజుల ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
నోటుకు ఓటు కేసులో ఎసిబి అధికారులు నలుగురిని ఇప్పటి వరకు అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలతో పాటు సెబాస్టియన్, ఉదయసింహలను అరెస్టు చేశారు. బెయిల్ రావడంతో వారు జైలు నుంచి విడుదలయ్యారు.