కరోనా వ్యాక్సిన్ వృథాలో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఎంత వేస్ట్ అవుతోందో తెలుసా.. మోదీ కీలక సూచనలు...
దేశంలో కరోనా వ్యాక్సిన్ వృథాలో తెలుగు రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. 10శాతం వరకూ వ్యాక్సిన్ వృథాకు కేంద్రం ఆమోదం ఉన్నప్పటికీ... ఈ రెండు రాష్ట్రాల్లో అంతకుమించిన వృథా జరుగుతోంది. తెలంగాణలో 17.6శాతం,ఆంధ్రప్రదేశ్లో 11.6శాతం మేర వ్యాక్సిన్ వృథా అవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల తర్వాత వ్యాక్సిన్ ఎక్కువగా వృథా చేస్తున్న జాబితాలో ఉత్తరప్రదేశ్ ఉంది. ఆ రాష్ట్రంలో 9.4శాతం వ్యాక్సిన్ వృథా అవుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. యూపీ తర్వాత 6.9శాతం వ్యాక్సిన్ వృథాతో కర్ణాటక నాలుగో స్థానంలో ఉంది.
కరోనా సెకండ్ వేవ్ ను ఆపాలి , సత్వర నిర్ణయాలు తీసుకోకుంటే కరోనా కంట్రోల్ కష్టం : సీఎంలతో పీఎం మోడీ
ఇదే విషయాన్ని ప్రస్తావించిన మోదీ...
ముఖ్యమంత్రులతో వర్చువల్గా జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా వ్యాక్సిన్ వృథాపై స్పందించారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో వ్యాక్సిన్ వృథా 10 శాతం కంటే ఎక్కువగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ వృథాను సమీక్షించాలని... అసలు ఎందుకు వృథా అవుతున్నదో పరిశీలించాలని సూచించారు. సాధ్యమైనంతవరకూ వ్యాక్సిన్ వృథాను అరికట్టాలన్నారు. కోవిడ్ 19 సెకండ్ వేవ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాల్సిందేనని ముఖ్యమంత్రులకు స్పష్టం చేశారు.
దేశంలో వ్యాక్సిన్ కొరత లేదు : కేంద్రం
దేశంలో కోవిడ్ 19 వ్యాక్సిన్ పంపిణీకి ఎటువంటి కొరత లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. 'ప్రతీ రోజూ ఉదయం 9గంటలకల్లా అన్ని రాష్ట్రాల వ్యాక్సిన్ పంపిణీ డేటాను మేము అందిస్తున్నాం. ఇవాళ జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రులందరికీ ఆ డేటా అందజేశాం. ఇప్పటివరకూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్రం 7.54కోట్లు వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. అయినప్పటికీ ఎవరికైనా ఫిర్యాదులు ఉంటే... ఇక దానిపై మేమేమీ మాట్లాడదలుచుకోలేదు.' అని చెప్పారు.
భారత్లో వేగంగా వ్యాక్సినేషన్ డ్రైవ్...
ప్రపంచంలో ఇంత త్వరగా ఇన్ని కోట్ల టీకాలను పంపిణీ చేసిన దేశం భారత్ మాత్రమేనని రాకేష్ భూషణ్ పేర్కొన్నారు. అమెరికాలో గతేడాది డిసెంబర్ 14 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టగా... ఇప్పటివరకూ 10కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చారన్నారు. అదే భారత్ విషయానికి వస్తే జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభించగా... ఇప్పటివరకూ 3.58కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. ప్రస్తుతం దేశంలోని 50వేల ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మార్చి 15న ప్రపంచవ్యాప్తంగా 8మిలియన్ల వ్యాక్సిన్లు ఇవ్వగా... ఒక్క భారత్లోనే 3.04మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చామన్నారు.
సెకండ్ వేవ్ అలర్ట్...
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలా అని ప్రజలను ఆందోళనకు గురి చేయాల్సిన అవసరం లేదన్నారు. ముందు జాగ్రత్త చర్యలతో కరోనాకు బ్రేక్ వేయాలన్నారు. రాష్ట్రాల అభ్యర్థన మేరకు 45 ఏళ్లు పైబడిన వాళ్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. కరోనాను నియంత్రించేందుకు మాస్కులు, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచించింది. జనం గుమిగూడే అవకాశం ఉన్న కార్యక్రమాల్లో ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని చెప్పింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగాలని సూచించింది.