వైయస్ రాజశేఖర రెడ్డి 'ఒకే దెబ్బకు'..!: కెసిఆర్ డిఫెన్స్లో పడ్డారా?
హైదరాబాద్: రైతు ఆత్మహత్యల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిక్కుల్లో పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మంగళవారం నాడు ఈ అంశంపై శాసన సభలో చర్చ జరిగింది. ఈ సమయంలో విపక్షాలతో పాటు మిత్రపక్షంగా భావిస్తున్న మజ్లిస్ పార్టీ కూడా సీఎం కెసిఆర్ పైన మండిపడింది.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి మరీ మజ్లిస్ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ఇక, మిగతా విపక్షాలు... రైతు ఆత్మహత్యలపై టిఆర్ఎస్ ప్రభుత్వం పైనే మండిపడ్డారు.
రైతు ఆత్మహత్యల విషయంలో తొలి నుంచి కెసిఆర్ ప్రభుత్వంపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక విధంగా ఈ విషయంలో అధికార పార్టీ డిఫెన్స్లో పడిందని చెబుతున్నారు. రైతుల ఆత్మహత్యల నెపాన్ని గత ప్రభుత్వాల పైన వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
దాదాపు, అన్ని పార్టీలు గత ప్రభుత్వాలు, ఆంధ్రా పాలకులు, వానదేవుడు అంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేయవద్దని హితవు పలికాయి. అంతేకాదు, నిన్నటి వరకు రైతుల ఆత్మహత్యల పైన కెసిఆర్ పెదవి విప్పక పోవడాన్ని కూడా విపక్షాలు ప్రశ్నించాయి.
ఎన్నో విషయాల పైన మాట్లాడుతున్న కెసిఆర్.. రైతుల ఆత్మహత్య పైన ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు నిన్నటి వరకు ప్రశ్నించాయి. అంతేకాదు, ముఖ్యమంత్రి, మంత్రుల జిల్లాల్లోనే ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని అక్బర్ లెక్కలతో సహా చెప్పారు.
వైయస్తో పోల్చి ఏకిపారేశారు
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని అక్బరుద్దీన్ గుర్తు చేశారు. వైయస్ అమలు చేసిన సంక్షేమ పథకాలపై తెలంగాణ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రైతు ఆత్మహత్యలపై జరిగిన చర్చలో పాల్గొన్న అక్బరుద్దీన్ సాగు రుణాల మాఫీని ప్రస్తావించారు. రుణమాఫీని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం విడతలవారీగా రుణాల్ని మాఫీ చేయడమేమిటని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. దివంగత వైయస్ మాత్రం ఒకేసారి రైతుల అప్పులన్నిటినీ మాఫీ చేసేశారన్నారు.
దాంతో, రైతులకు ఎంతో ప్రయోజనం కలిగిందన్నారు. కానీ, ఇప్పుడు విడతలవారీగా చేస్తుండటంతో రైతులకు ఊరట లభించడం లేదని అభిప్రాయపడ్డారు. టిడిపి, కాంగ్రెస్, బిజెపిలు కూడా మొదటి నుంచి ఇదే చెబుతున్నాయి. విడతలవారీగా కాకుండా, ఒకేసారి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకేసారి మాఫీ కోసం ప్రయత్నిస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు.
కాగా, ఓటుకు నోటు కేసు అంశం తర్వాత టిడిపిని చిక్కుల్లో పెట్టడమే కాకుండా, ఇతర పార్టీలకు ఒక రకమైన హెచ్చరికను టిఆర్ఎస్ జారీ చేసిందనే వాదనలు వినిపించాయి. అయితే, రైతుల ఆత్మహత్యల అంశం ఇప్పుడు కెసిఆర్ను డిఫెన్స్లో పడేసిందని అంటున్నారు.
ఈ అంశంపై ఆయన మాట్లాడకపోవడం మరింత ఆగ్రహానికి గురి చేస్తోందంటున్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే చైనా పర్యటనకు వెళ్లడం ఏమిటని విపక్షాలు మండిపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కెసిఆర్ జిల్లాలోనే ఎక్కువ ఆత్మహత్యలు ఉండటాన్ని విపక్షాలు పదేపదే ప్రస్తావిస్తున్నాయి.
మంగళవారం నాడు అసెంబ్లీలో చర్చ సందర్భంగా... జానా రెడ్డి మాట్లాడిన సమయంలో, ముఖ్యమంత్రి రైతు ఆత్మహత్యల అంశాన్ని చేర్చాలని ఉందా అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వంలో డిఫెన్స్లో పడిందనేందుకు ఉదాహరణగా కనిపిస్తోందని అంటున్నారు. అక్బర్ వ్యాఖ్యలపై కెటిఆర్ అసహనం కూడా అలాగే కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమని అధికార పార్టీ ఆరోపిస్తోంది. రైతు ఆత్మహత్యలతో పాటు ఏ సమస్య పైన అయినా, ఎంత సమయమైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది.