సస్పెండ్ చేశారుగా?: స్పీకర్ నోటీసులపై ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ మారిన వారిపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి అధికార టీఆర్ఎస్లోకి చేరిన ఐదుగురు ఆయన నోటీసులు జారీ చేశారు. పార్టీ మారిన వైనంపై వారంలోగా వివరణ ఇవ్వాలని కోరారు.
నోటీసులు అందుకున్న వారిలో టీడీపీఎల్పీ నాయకుడిగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు వివేక్గౌడ్, సాయన్న, ప్రకాశ గౌడ్, రాజేందర్ రెడ్డి ఉన్నారు. పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇటీవల టీడీపీ తరపున ఆ పార్టీ నేత రేవంత రెడ్డి తదితరులు స్పీకర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే, సదరు ఫిర్యాదుపై వారి వివరణ కోరుతూ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతక ముందే టీఆర్ఎస్లోకి చేరిన మరో ఐదుగురు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివా్సయాదవ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషనరెడ్డి, మాధవరం కృష్ణారావు, చల్లా ధర్మారెడ్డిలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు.
నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఏవిధమైన వివరణ ఇవ్వనున్నారు? స్పీకర్ ఏ విధంగా స్పందించనున్నారన్న విషయం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఈ నోటీసులను అందుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో నోటీసులపై స్పందించిన ఎర్రబెల్లి ‘‘టీడీపీ ఇప్పటికే మమ్మల్ని సస్పెండ్ చేసింది. ఇక నోటీసులు ఎందుకు?'' అంటూ వ్యాఖ్యానించారు. అయితే మిగిలిన నలుగురు ఈ నోటీసులపై స్పందించేందుకు నిరాకరించారు.