బండి సంజయ్ ఆన్ ఫైర్: ఏం పీకుతావ్: రాక్షసుడు కేసీఆర్: కాలర్ పట్టుకుంటాం: ఓటమిపై స్కానింగ్
హైదరాబాద్: తెలంగాణలో ముగిసిన రెండు పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం పట్ల బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ ఎన్నికల్లో తాము ఓడిపోతే పీఆర్సీ ఇవ్వమంటూ టీఆర్ఎస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. ఆ బెదిరింపుల భయంతోనే ఓటర్లు అధికార పార్టీకి ఓటు వేశారని అన్నారు. పీఆర్సీపై నిఖార్సయిన పోరును తాము కొనసాగించామని చెప్పారు. ఎన్నికల తరువాత కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని, పీఆర్సీని తగ్గించడానికి ప్రయత్నిస్తే.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గల్లా పట్టుకుంటామని హెచ్చరించారు.
ఓట్ల శాతం పెరిగింది.. నైతిక విజయం మాదే..
కొద్దిసేపటి కిందటే ఆయన హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎలా గెలిచిందో ప్రజలకు తెలుసని చెప్పారు. ఈ రెండు ఓటములు ఎదురైనప్పటికీ.. తాము కుంగిపోవట్లేదని, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని స్పష్టం చేశారు. రెండు నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ ఓటు శాతం పెరగటమే దీనికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అడ్రస్ గల్లంతైందని వ్యాఖ్యానించారు. తమ పార్టీని ఓడించడానికి ఇతర రాజకీయ పక్షాలు లోపాయకారి ఒప్పందాలను కుదుర్చుకు్నాయని విమరర్శించారు. ఈ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని అన్నారు.
రాక్షసుడిగా మారిన కేసీఆర్..
ప్రజలు కేసీఆర్పై నమ్మకం ఉంచి బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణను ఆయన చేతుల్లో పెట్టారని, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి నడుచుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ఓ రాక్షసుడిలా మారారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ముఖం కూడా చూడటానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరని అన్నారు. బీజేపీిని ఎదుర్కొనడానికి తన ముఖం చూపించలేకపోయారని, అందుకే కాంగ్రెస్, పీవీ నరసింహా రావు పేరును అడ్డుగా పెట్టుకుని గెలిచారని చెప్పారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ గెలిచినట్టా? పీవీ నరసింహా రావు గెలిచినట్టా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
అన్నీ కేంద్రమే చేస్తే..
ఎన్నికలు రాగానే.. తమ వైఫల్యాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వంపై మోపడం కేసీఆర్ సర్కార్కు అలవాటైందని బండి సంజయ్ విమర్శించారు. అన్నింటికీ కేంద్రంపైనే మోపితే.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏం పీకుతున్నాడని మండిపడ్డారు. అందుకే- అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేసిన ప్రజలు లోక్సభలో తమ పార్టీని ఆదరించారని అన్నారు. ఢిల్లీకి పోయి కత్తి తిప్పుతానని చెప్పిన కేసీఆర్.. ఇఫ్పుడాపని ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను విమర్శించడం సరికాదని, ఆజంజాహి మిల్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమయ్యాయని నిలదీశారు.
నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే..
ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా 70 శాతం మంది ఓటర్లు టీఆర్ఎస్ను వ్యతిరేకించారని అన్నారు. వ్యతిరేక ఓట్లు చీలిపోవడం వల్లే ఆ పార్టీ గెలిచిందని వ్యాఖ్యానించారు. వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం ద్వారా మాత్రమే విజయం సాధ్యమైందని ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త నమ్ముతున్నాడని, అందుకే విజయోత్సవాలను జరుపుకోవడానికి ఇష్టపడట్లేదని బండి సంజయ్ చెప్పారు. నిరుద్యోగులకు కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీరాల్సిందేనని, లేదంటే ఆయన కాలర్ పట్టుకుంటామని హెచ్చరించారు. కేసీఆర్కు చుక్కలు చూపుతామని ఎన్నికలకు ముందే చెప్పామని, చెప్పినట్టే చేశామని అన్నారు.