చంద్రబాబుకు బీజేపీ భారీ షాక్- తెలంగాణలో పొత్తుపై కీలక ప్రకటన..
తెలంగాణలో బీజేపీతో టీడీపీ పొత్తుపై కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అమిత్ షా, జేపీ నడ్డా వంటి బీజేపీ జాతీయ స్ధాయి నేతలు హైదరాబాద్ కు వచ్చి టీడీపీకి సన్నిహితంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్, రామోజీరావుతో పాటు పలువురు తటస్ధ వ్యక్తుల్ని కలిసి వెళ్లారు. వీరి భేటీల్లో బీజేపీకి టీడీపీ మద్దతిప్పించేలా ఒప్పందం కుదిరిందనే ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు తాజాగా ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సైతం ఈ ప్రచారాన్ని ధృవీకరించేలా కొన్ని పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తరుణ్ చుగ్ ఇవాళ దీనిపై ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆయన టీడీపీ-బీజేపీ పొత్తుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న తాను ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అంశాలపై తరుణ్ చుగ్ పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. ఇందులో తాను ఎక్కడా టీడీపీ-బీజేపీ పొత్తు ఉండబోతోందని, అలాగే వైఎస్ షర్మిలకు కూడా అండగా ఉంటామని చెప్పలేదని చుగ్ క్లారిటీ ఇచ్చారు. అసలు మీడియా ప్రతినిధులతో తన చిట్ చాట్ లో అలాంటి చర్చే రాలేదన్నారు.
తెలంగాణలో బీజేపీ.. టీడీపీ పొత్తు పెట్టుకునే యోచనలో ఉన్నట్లు ఓ సెక్షన్ మీడియాలో వచ్చిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తరుణ్ చుగ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కథనం పూర్తిగా అవాస్తవమన్నారు. పార్టీకి దురుద్దేశాలు ఆపాదించే లక్ష్యంతో ఈ కథనాన్ని సృష్టించినట్లు అర్ధమవుతోందన్నారు. రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన పార్టీలు బీజేపీపై అసత్య ప్రచారాలు చేస్తూ పొత్తు కోసం అర్రులు చాస్తున్నాయంటూ టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించేంత బలం బీజేపీకి ఉందని తరుణ్ చుగ్ తెలిపారు. బీజేపీనే రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాన్నారు. బీజేపీ తెలంగాణ ఇన్ ఛార్జ్ గా ఈ తప్పుడు ప్రచారాన్ని మరోసారి ఖండిస్తున్నట్లు చుగ్ తెలిపారు. అలాగే పుకార్లను వ్యాప్తి చేయడం మానుకోమని మీడియాకు కూడా ఆయన సూచించారు.