6న బడ్జెట్, 8న, ఆ రెండ్రోజులు సెలవులు: బీఏసీ సమావేశంలో కీలక చర్చ
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం ముగిసింది. బడ్జెట్, పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం అవసరమైతే మిగిలిన అంశాలపై చర్చ చేపట్టాలని బీఏసీ నిర్ణయించింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం ముగిసింది. బడ్జెట్, పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం అవసరమైతే మిగిలిన అంశాలపై చర్చ చేపట్టాలని బీఏసీ నిర్ణయించింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 6న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 8న బడ్జెట్, పద్దులపై చర్చించనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శనివారం అసెంబ్లీలో చర్చ చేపట్టనున్నారు. ఫిబ్రవరి 5, 7 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు.
కాగా, సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉన్నందున బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా కోరారు. కనీసం 25 రోజులపాటు సమావేశాలు నిర్వహించాలన్నారు. అన్ని అంశాలపై చర్చిద్దామని తెలిపిన మంత్రులు.. బడ్జెట్పై, పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లు అనంతరం అవసరం అనుకుంటే మిగిలిన అంశాలపై చర్చిద్దామని తెలిపారు.
మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సరిగా ప్రొటోకాల్ ఇవ్వడం లేదని భట్టి విక్రమార్క ప్రస్తావించారు. కానిస్టిట్యూషన్ నిర్మాణం అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. ఇక బడ్జెట్ సమావేశాలు 20 రోజులపాటు నిర్వహించాలని మజ్లిస్ పార్టీ కోరింది. సమావేశాల్లో చర్చించేందుకు 25 అంశాలను ప్రతిపాదించింది.
కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన సందర్భంగా.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించిన విషయం తెలిసిందే. సభకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.