మోడీ వెనక్కి తగ్గరు, మారకుంటే మనకే నష్టం: కేసీఆర్, నిజమే ప్రధాని మెచ్చుకున్నారు
కేంద్రం క్యాష్ లెస్ విషయంలో వెనక్కి పోదని, మనం మారకుంటే నష్టపోవాల్సి ఉంటుందని, నగదు రహితానికి ప్రజలను చేద్దామని తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశంలో శనివారం అన్నారు.
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ఫలితాలపై నెల గడిచినా సరైన అంచనాలు లేవని, కేంద్రం క్యాష్ లెస్ విషయంలో వెనక్కి పోదని, మనం మారకుంటే నష్టపోవాల్సి ఉంటుందని, నగదు రహితానికి ప్రజలను చేద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశంలో శనివారం అన్నారు.
శనివారం సచివాలయంలో కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. మూడు గంటల పాటు జరిగిన భేటీలో పలు అంశాలపై చర్చించారు. కేసీఆర్ తన ఢిల్లీ పర్యటన వివరాలను మంత్రులకు చెప్పారు.
ఈ సందర్భంగా కొందరు మంత్రులు మాట్లాడుతూ.. మన ఎంపీల ముందు మిమ్మల్ని ప్రధాని మోడీ మెచ్చుకున్నారని తెలిసిందని, నోట్ల రద్దు విషయంలో మీరు ఇచ్చిన మద్దతుకు అభినందించారట అని అడిగారు. దానికి కేసీఆర్ అవును.. నిజమేనని సమాధానం చెప్పారని తెలుస్తోంది.

క్యాష్ లెస్ లావాదేవీల తెలంగాణ
తెలంగాణను వంద శాతం క్యాష్ లెస్ లావాదేవీల రాష్ట్రంగా మార్చాలని మంత్రిమండలి నిర్ణయించింది. దీనిపై విధివిధానాల రూపకల్పనకు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.

సిద్దిపేటపై ప్రశంసలు
నగదు రహిత లావాదేవీలు కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు కష్టాలు కలుగుతున్నా దీన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కేసీఆర్ చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గంలో నగదు రహిత లావాదేవీలు తీరుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. ప్రధాని మోడీ సైతం మెచ్చుకున్నారన ్నారు.

ప్రభుత్వపరంగా..
కొన్ని ఆర్థిక ఇబ్బందులున్నా నగదు రహిత విధానాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వం ద్వారా జరిగే అన్ని చెల్లింపులు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తదితర లావాదేవీలన్నీ నగదు రహితంగా ఆన్లైన్లోనే జరగాలన్నారు. ఆర్టీసీలోనూ స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

టిఎస్ వ్యాలెట్
టీఎస్ వాలెట్ త్వరలో సిద్ధమవుతుందని, దాని ద్వారా సేవలు విస్తృతం చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. టీఎస్ వాలెట్ రూపకల్పన గురించి చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ సేవల వాలెట్గా దీన్ని తయారు చేస్తామన్నారు.

కేటీఆర్ అధ్యక్షతన
మంత్రి కేటీఆర్ అధ్యక్షతన గల ఉపసంఘంలో జగదీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావులు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రకు మంత్రివర్గ సమావేశంలో సీఎం స్వాగతం పలికారు. ఆయనను మంత్రులకు పరిచయం చేశారు.

ఇంకా మరిన్ని..
కొత్త భూసేకరణ విధానానికీ అనుమతించింది. రాష్ట్రంలో ప్రయివేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కూడా మంత్రిమండలి పచ్చజెండా వూపింది. దీని బాధ్యతలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని ఉపసంఘానికి అప్పగించింది. పనిలేని శాఖల నుంచి పనిభారం గల శాఖలకు ఉద్యోగుల తరలింపునకు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications