నేడే తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్.. అవే ప్రధాన ఎజెండా..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేటి(ఫిబ్రవరి 16) సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. పట్టణ ప్రగతి,సీఏఏ, ఎన్నార్సీలపై తీర్మానం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వివక్ష వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా కేబినెట్ చర్చించనుంది. వీటితో పాటు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చించనున్నారు. పట్టణ ప్రగతికి సంబంధించి మంత్రులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. మున్సిపాలిటీలను ఎలా తీర్చిదిద్దాలన్న అంశంపై సలహాలు,సూచనలు చేయనున్నారు. సోమవారం కేసీఆర్ 66వ జన్మదినం కావడంతో... ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
సీఏఏ వ్యతిరేక తీర్మానంపై చర్చ
ఇటీవలి మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)లను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే వీటిపై అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే కేబినెట్ భేటీలో వీటి తీర్మానంపై చర్చ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం దాదాపుగా ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
నిధుల వివక్షపై చర్చించే అవకాశం..
పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి భారీ ఆదాయం సమకూరుతున్నా... నిధుల కేటాయింపులో రాష్ట్రంపై వివక్ష చూపించడాన్ని కేసీఆర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు నిధుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని గతంలో ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో నిధుల అంశాన్ని కూడా కేబినెట్లో చర్చించి.. అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. మరోవైపు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తెలంగాణకు రానున్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై ఆమె ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. దీన్ని కూడా కేబినెట్లో చర్చించవచ్చు.
కొత్త పాలసీ రూపకల్పన..
ఇక ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి.. అక్కడ అనేక సమస్యలతో సతమతమవుతున్న తెలంగాణవాసుల కోసం కొత్త పాలసీని తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గల్ఫ్ పర్యటనకు కూడా వెళ్లనున్నారు. గల్ఫ్లో పనిచేస్తున్న తెలంగాణవాసుల వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయన అక్కడికి వెళ్లనున్నారు.ఇక ఈ కొత్త పాలసీ కోసం ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అమలుచేస్తున్న పథకాలను ప్రభుత్వం పరిశీలించింది. ఇందులో కేరళ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకం ఉత్తమంగా ఉండటంతో.. దాన్నే అనుసరించాలనే యోచనలో ఉంది.
జాయింట్ కలెక్టర్ల అంశంపై..
కొత్త రెవెన్యూ చట్టం, పీఆర్సీ అమలు, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పాటించాల్సిన పొదుపు చర్యలపై కేసీఆర్ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ల రద్దు నిర్ణయంపై కేబినెట్లో చర్చించి ఆమోదించనున్నారు.