కేసీఆర్ టాప్ గేర్: కేజ్రీవాల్తో భేటీ: ఢిల్లీకి ప్రయాణం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన దూకుడును పెంచారు. టాప్గేర్లో దూసుకెళ్తోన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ సాయంత్రం కేసీఆర్ హస్తినకు ప్రయాణం కట్టనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను ఆయన కలుసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు పలువురు జాతీయ నేతలతో భేటీ కానున్నారని సమాచారం.
బలాన్ని కూడగట్టే ప్రయత్నం..
బీజేపీ సారథ్యాన్ని వహిస్తోన్న ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సంకీర్ణ కూటములకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ను తెర మీదికి తీసుకుని వచ్చే ప్రయత్నాలు కొద్దిరోజులుగా సాగిస్తోన్నారు కేసీఆర్. ఇందులో భాగంగా కొద్దిరోజుల కిందటే ముంబై వెళ్లారు. శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేను కలుసుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యిగా కొనసాగుతున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్తోనూ భేటీ అయ్యారు.
వారితో టచ్లో..
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్తోనూ కేసీఆర్ టచ్లో ఉన్నారు. మమత బెనర్జీ స్వయంగా హైదరాబాద్కు వస్తారని, కేసీఆర్ను కలుసుకుంటారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. బీజేపీకి ఉన్న బలం ఏమిటో స్పష్టం చేసే- అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు.
జేడీఎస్ సపోర్ట్..
కేసీఆర్ ఏర్పాటు చేయదలిచిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు జనతాదళ్ (సెక్యులర్) ఇదివరకే తన సంపూర్ణ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ- కేసీఆర్కు ఫోన్ సైతం చేశారు. జాతీయ స్థాయి రాజకీయాలపై చర్చించారు. మూడో ప్రత్యామ్నాయ కూటమి గురించి మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కేసీఆర్ మొదలు పెట్టిన యుద్ధంలో తాము కూడా పాల్గొంటామని దేవేగౌడ భరోసా ఇచ్చారు.
కేజ్రీవాల్ కోసం..
అరవింద్ కేజ్రీవాల్ను కలుసుకోవడానికి కేసీఆర్ సమాయాత్తమౌతున్నారు. ఈ సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. కేజ్రీవాల్తో పాటు పలువురు జాతీయ నాయకులను కలుసుకుంటారని అంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు సీనియర్ నాయకులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారని సమాచారం. వారందరి అపాయింట్మెంట్ ఖరారైన తరువాతే కేసీఆర్.. ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
టార్గెట్గా బీజేపీ..
కేసీఆర్ టార్గెట్ బీజేపీయే అనడంలో సందేహాలు అక్కర్లేదు. జాతీయ స్థాయిలో కమల నాథులను ఢీ కొట్టడానికి సైతం వెనుకాడట్లేదు. దీనికోసం జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్షాల మద్దతును కూడబెడుతున్నారు. ఢిల్లీలో త్వరలో ప్రతిపక్ష, ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులతో నిర్వహించేబోయే సమావేశానికి సన్నాహాకంగా కేసీఆర్ పర్యటనను భావిస్తున్నారు. భావసారూప్యం గల ఇతర పార్టీల నాయకులను కలుపుకొని వెళ్లాల్సి ఉంటుందని, దీనికి సంబంధించిన ఉమ్మడి అజెండాపై ఢిల్లీలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ధారిస్తారని తెలుస్తోంది.