ప్రధాని మోడీతో కేసీఆర్ భేటీ: 45నిమిషాలపాటు కీలక అంశాలపై చర్చ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర నిధులు, సచివాలయ నిర్మాణానికి రక్షణశాఖ స్థలం కేటాయింపుపై చర్చించారు. రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాల్సిందిగా ప్రధానిని కోరారు. తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలని, ఐటీఐఆర్ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇలా 11 వినతిపత్రాలను కేసీఆర్ మోడీకి అందజేశారు.
కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు, రిజర్వేషన్ల పెంపునకు రాజ్యాంగ సవరణ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధుల విడుదలపై ప్రధానితో సీఎం కేసీఆర్ చర్చించారు. సుమారు 400కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నట్లు తెలిపినట్లు సమాచారం.
ప్రధాని మోడీతో సుమారు 45నిమిషాలపాటు కేసీఆర్ సమావేశమయ్యారు. ఉద్యోగాలు భర్తీ చేసుకునేందుకు జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాలని ఈ సందర్భంగా ప్రధానిని కోరారు. అలాగే, విభజన జరిగి నాలుగేళ్లైనా హైకోర్టు విభజన జరగకపోవడంపై ప్రస్తావించారు. తెలంగాణ నుంచి హైకోర్టులో 6గురు న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేయాలని కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. పలు రాజకీయ అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. ముందస్తు ఎన్నికల అంశం చర్చించినట్లు తెలిసింది. తెలంగాణలో ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని ప్రధానికి కేసీఆర్ వివరించారు. ఇప్పటికే కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ను కలిసిన కేసీఆర్.. హోంమంత్రి రాజ్నాథ్ను శనివారం కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ బయల్దేరనున్నారు.