కేసీఆర్-అఖిలేష్ యాదవ్ కీలక భేటీ: ఈడీ వరుస దాడుల నేపథ్యంలో.. ప్రశాంత్ కిషోర్తో
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హస్తిన పర్యటనలో బీజీగా ఉంటోన్నారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన ఆయన ఇప్పటివరకు పలువురు జాతీయ స్థాయి ప్రతిపక్ష పార్టీల నేతలను కలుసుకొన్నారు. దేశ రాజకీయాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. మూడు రోజుల క్రితం హస్తిన వెళ్లిన ఆయన ఈ మధ్యాహ్నం సమాజ్వాది పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్, సీనియర్ నాయకుడు రామ్గోపాల్ యాదవ్తో సమావేశం అయ్యారు.
ఖమ్మం ఖిల్లాలో వైఎస్ జగన్ ఎంట్రీ: చెల్లి కోసమా?: ఎనిమిదేళ్ల తరువాత రాక
పార్లమెంట్ సమావేశాలపై..
తన నివాసానికి వచ్చిన వారిద్దరినీ కేసీఆర్ శాలువ కప్పి సన్మానించారు. అనంతరం దేశ రాజకీయాలపై సుమారు గంటపాటు చర్చించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చోటు చేసుకుంటోన్న పరిణామాలపై మాట్లాడారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వరుసగా మూడు రోజుల పాటు విచారించడం, పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ, అర్పిత ఛటర్జీ నివాసాలపై దాడులు సాగించడం వంటి పరిణామాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈడీ దాడులతో..
ఆమ్ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ను కూడా ఈడీ అధికారులు విచారిస్తోన్న విషయం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు చెబుతోన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ప్రతిపక్ష పార్టీల నాయకులపై సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ అధికారులను ప్రయోగిస్తోందని, దీన్ని అడ్డుకోవడానికి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి కేసీఆర్-అఖిలేష్ యాదవ్ మాట్లాడినట్లు తెలుస్తోంది.
మారిన షెడ్యూల్..
నిజానికి- తన ఢిల్లీ పర్యటన సందర్భంగా కేసీఆర్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారంటూ మొదట్లో వార్తలొచ్చాయి గానీ.. అది వాస్తవ రూపం దాల్చలేదు. ఆయన రాష్ట్రపతి భవన్కు వెళ్లలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు బదులుగా ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో వరద తగ్గుముఖం పట్టకపోవడం, అదే సమయంలో కేటీఆర్ కాలిగాయంతో ఇంటికే పరిమితమైన ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ఢిల్లీలో మకాం వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రశాంత్ కిషోర్ నివేదికతో..
అసెంబ్లీ ఎన్నికల్లో జయాపజయాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇదివరకే ఇచ్చిన నివేదిక గురించి ఆయన జాతీయ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తోన్నారనే ప్రచారం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ సర్వే ఫలితాల గురించి ప్రశాంత్ కిషోర్తో ఫోన్లో సంప్రదించారని అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే.. విజయావకాశాలు ఎలా ఉంటాయనే విషయంపై ఆరా తీసినట్లు చెబుతున్నారు.
ముందస్తుకు వెళ్తారా?
కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం కొద్దిరోజులుగా జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలను నిర్వహించేలా ఆయన పావులు కదుపుతారనే ప్రచారం ఉంది. ఆయా అంశాలన్నింటిపైనా కేసీఆర్.. జాతీయ స్థాయి ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని, అందులో భాగంగానే సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, రామ్గోపాల్ యాదవ్ను కలిసినట్లు చెబుతున్నారు.