ఫిబ్రవరి 18న మేడారానికి తెలంగాణా సీఎం కేసీఆర్... జాతరకు సర్వం సిద్ధం; మంత్రుల వెల్లడి
మేడారంలో జరుగుతున్న సమ్మక్క-సారలమ్మల జాతరకు కుటుంబ సమేతంగా వచ్చే భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 18వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం జాతరకు రానున్నట్లు గా మంత్రులు వెల్లడించారు.
ఫిబ్రవరి 18 న మేడారం జాతరకు సీఎం కేసీఆర్ ...
అన్ని వర్గాలు మేడారం జాతరకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో భక్తుల సంఖ్య ఇప్పటికే భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు అధికారులకు తగు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో మేడారంలో అన్ని ఏర్పాట్లు చేశామని, ఒక్క చిన్న లోటు కూడా ఉండకుండా చూడాలని సీఎం కెసిఆర్ ఆదేశించిన మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఈనెల 18న సీఎం కేసీఆర్ మేడారం జాతరకు వస్తారని, మొక్కులు చెల్లించుకుంటారని వెల్లడించారు.
కరోనా జాగ్రత్తలతో అమ్మవార్ల దర్శనం చేసుకోవాలన్న మంత్రి ఎర్రబెల్లి
అవసరం అయితే మరిన్ని నిధులు కేటాయించేందుకు సీఎం సిద్దంగా ఉన్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. పారిశుధ్యం నిర్వహణలో ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. భక్తులు కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవార్లను దర్శనం చేసుకోవాలని సూచించారు. దగ్గు, జలుబు ఉన్నవారు వెంటనే సమీపంలోని వైద్యశాలను సంప్రదించాలని సూచించారు. కరోనా సోకిన వారిని క్వారంటైన్ లో ఉంచే ఏర్పాట్లు చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఆదివాసుల సంఘాలు, పూజారులు ఐక్యతతో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మేరకు జాతర నిర్వహిస్తామన్నారు.
జాతరను విజయవంతం చెయ్యాలన్న మంత్రి సత్యవతి రాథోడ్
రాజకీయాలతో సంబంధం లేకుండా జాతరను విజయవంతం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ప్రభుత్వం కేటాయించిన రూ.75 కోట్ల రూపాయలను మౌళిక వసతుల కల్పనకు ఖర్చు చేశామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇప్పటికే జంపన్న వాగులోకి లక్నవరం నీటిని విడుదల చేశామని వెల్లడించారు. వాగులో ప్రమాదాలు జరగకుండా గజఈతగాళ్ళను ఏర్పాటు చేశామని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు .
40 వేలమంది రవాణా విధుల్లో.. గద్దెల సమీపానికి ఆర్టీసీ బస్సులు
40 వేలమంది రవాణా విధుల్లో పాల్గొంటారని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మేడారం జాతరలో ఆర్టీసీ పాత్ర చాలా కీలకమని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. గతంలో 3300 బస్సులు ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది జాతర కోసం 3800 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు మాత్రమే సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెల సమీపంలో దిగే ఏర్పాటు ఉందన్నారు. కనుక భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం సురక్షితమని వెల్లడించారు.