జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల వంటి అంశాలపై చర్చిస్తున్నారు. తాజాగా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్ కలిశారు. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద తెలంగాణకు రావల్సిన బకాయిలు రూ.693.13 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
వైద్యా ఆరోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక చర్యలను కేంద్రమంత్రికి సీఎం వివరించారు. ఆరోగ్య మిషన్ 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు పెండింగ్లో ఉండటమే కాకుండా 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ రూ.138 కోట్లు కూడా మంజూరు చేయాల్సి ఉందని తెలియజేస్తూ, ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ కోరారు.

ఆయుష్మాన్ భారత్ నిబంధనలు అన్నింటిని తాము ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకుగానూ 5,159 బస్తీ దవాఖానాలు (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) సమర్థంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద చేపట్టిన మౌలిక వసతులు, నిర్వహణ కాంపోనెంట్ కింద 2023-2024 సంవత్సరానికి సంబంధించి రావల్సిన రూ.231.40 కోట్ల నిధులను కూడా తక్షణమే రీయింబర్స్ చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఈ నిధుల విడుదలలో జాప్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం వాటా మొత్తాన్ని కూడా అక్టోబర్ 2023 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి జేపీ నడ్డా దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.
కేంద్రమంత్రిని కలిసిన మంత్రి సీతక్క
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రఘునాథ్ పాటిల్ను తెలంగాణ మంత్రి సీతక్క మంగళవారం కలిశారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీరు అందించేందుకు నిధులు కేటాయించాలని కేంద్రమంత్రిని కోరారు. ప్రస్తుతం తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 56.98 లక్లల గృహాలకు రక్షిత మంచినీరు అందుతుందని సీతక్క తెలిపారు. కొత్తగా ఏర్పాటైన గ్రామాలు, కొత్తగా నిర్మించిన ఇళ్లకు నల్లాల ద్వారా మంచినీటి సరఫరాకు నిధులు విడుదల చేయాలని కరారు. అంతకుముందు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కూడా మంత్రి సీతక్క కలిశారు. పలు అంశాలపై చర్చించారు.
ఇక, సోమవారం రోజున కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్లను సీఎం రేవంత్ కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్సీ మోడల్లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
తాము నిర్మించ తలపెట్టిన 25 లక్షల ఇళ్లలో 15 లక్షలు ఇళ్లు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని, వాటిని లబ్ధిదారు ఆధ్వర్యంలోని వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం (బీఎల్సీ) పద్థతిలో నిర్మించనున్నట్లు తెలిపారు. మరోవైపు, వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో స్మార్ట్ సిటీ మిషన్ కింద చేపట్టే పనులు పూర్తి కాలేదని తెలియజేస్తూ, మిషన్ కాల పరిమితి వచ్చే జూన్ 30తో ముగుస్తున్నందున ఆ గడువును జూన్ 2025 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద వరంగల్లో రూ.518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు, కరీంనగర్లో రూ.287 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వివరించారు.












Click it and Unblock the Notifications