తెలంగాణా కాంగ్రెస్ మరో ప్లాన్.. నవసంకల్ప్ చింతన్ శిబిర్.. రాష్ట్రంలో ఎన్నికలకు రోడ్ మ్యాప్!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రంలో అధికారం దిశగా ముందుకు వెళ్ళడానికి అనేక వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి రైతు రచ్చబండ కార్యక్రమం ద్వారా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ, తాజాగా రాష్ట్రంలోని సమస్యలపై చర్చించి తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ పై పోరాటానికి రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తుంది.
ఉదయ్పూర్ తరహాలో తెలంగాణా లోనూ చింతన్ శిబిర్
ఇటీవల రాజస్థాన్లోని ఉదయ్పూర్లో నిర్వహించిన నవ సంకల్ప్ శిబిర్కు కొనసాగింపుగా, జూన్ 1 మరియు 2 తేదీల్లో హైదరాబాద్లోనూ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి 'నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్'ను నిర్వహించనుంది. హైదరాబాదు కీసర లోని బాలవికాస వేదికగా జూన్ 1, 2 వ తేదీలలో తెలంగాణ కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ సిబిర్ సమావేశాలను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 33 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి 'చింతన్ శిబిర్' కమిటీని ఏర్పాటు చేశారు.
108మందికి చింతన్ శిబిరానికి ఆహ్వానం
ఈ కమిటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ సమావేశాలకు మొత్తం 108 మందిని ఆహ్వానించారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం మరియు ఉదయ్పూర్ నవ సంకల్ప్ ప్రకటనను తెలంగాణ వ్యాప్తంగా జిల్లా మరియు మండల స్థాయిలకు తీసుకెళ్లడంపై 'సంకల్ప్ శిబిర్' నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్ర-స్థాయి కార్యక్రమంలో రాబోయే 90 నుండి 180 రోజుల్లో ఖాళీగా ఉన్న అన్ని పంచాయితీ, మండల, బ్లాక్, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి స్థానాలను భర్తీ చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుంది.
చింతన్ శిబిరంలో రాష్ట్ర స్థాయి అంశాలపై చర్చ, తీర్మానాలు .. ఆసక్తి
అంతేకాదు ఉదయపూర్ లో ఏఐసీసీ ఏర్పాటుచేసిన మాదిరిగానే ఇక్కడ కూడా ముఖ్యనేతలతో ఆరు అంశాలపై ఆరు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు ఇక వారి అభిప్రాయాలను తీసుకుని వాటిని కాంగ్రెస్ పాలసీ గా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో మొదటిరోజు రాష్ట్ర స్థాయి అంశాలపై చర్చ ఉంటుంది రెండవ రోజు ప్రకటనలు తీర్మానం ఆమోదం ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉదయపూర్లో నిర్వహించిన చింతన్ శిబిరంలో చేసిన తీర్మానాల పట్ల కొంతమంది నేతలు అసంతృప్తి గా ఉండడంతో, తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న చింతన్ వేదికగా ఏం చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది.
రేవంత్ రెడ్డి లేకుండానే చింతన్ శిబిర్ సమావేశాలు
ఇక ఈ శిబిరానికి ప్రియాంక గాంధీని ఆహ్వానించినప్పటికీ ఆమె రావడంలేదని సమాచారం. ఇక మరోవైపు టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండడంతో రేవంత్ రెడ్డి లేకుండానే చింతన్ సిబిర్ సమావేశాలు కొనసాగనున్నాయి. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాలపై రాజకీయ పార్టీల నేతల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.