telangana election:ఈ రెండురోజులే కీలకం: తెలంగాణా పోలీసులకు డీజీపీ సూచనలు!!
తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల పండుగలో ముఖ్యమైన కౌంటింగ్ ఘట్టం రేపు జరగనుంది. ఈ ఘట్టంతో తెలంగాణా రాష్ట్ర ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఇక రేపు కౌంటింగ్ కు సంబంధించి అధికారులు అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయగా, పోలీసులు ఈ రెండు రోజులు జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని సూచిస్తున్నారు రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్.
ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. సీపీలు, ఎస్పీలతో డీజీపీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లెక్కింపు కేంద్రాల వద్ద బందోబస్తుపై ఆయన సమీక్షించారు. లెక్కింపు కేంద్రాల వెలుపల పటిష్ఠ నిఘా పెట్టాలని, కేంద్రాల లోపల సైతం దృష్టి సారించాలని అంజనీ కుమార్ సూచించారు.

చివరి రౌండ్లలో ఉత్కంఠగా ఉండే అవకాశం ఉంటుందని, ఆ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఎవరినీ గుమిగూడనివ్వొద్దని, పికెటింగ్ చేయడంతో పాటు అదనపు బలగాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ప్రతీకార దాడులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పోటీలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థులతో పోలీసు అధికారులు సమన్వయం చేసుకోవాలని, ఎవరు గెలుపొందినా పోలీసులకు సహకరించేలా వారి విధానం ఉండాలని వివరించాలని చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి విఘాతం లేకుండా ఎన్నికల బందోబస్తు నిర్వహించామని, ఈ రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండి ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని సీపీలు, ఎస్పీలను అంజనీ కుమార్ ఆదేశించారు.
ఇదిలా ఉంటె అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, దాదాపు 40 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసులను మోహరించి పహారా కాస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి 119 మంది సభ్యులను ఎన్నుకునేందుకు జరిగిన పోలింగ్ తుది తీర్పు కోసం అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. పోలీసులు మాత్రం రేయింబవళ్ళు ఎన్నికల నిర్వహణలో కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు.












Click it and Unblock the Notifications