తెలంగాణలో కల్లు బ్యాన్..? రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
కల్లు.. తెలంగాణ సంప్రదాయాల్లో ఒకటి. రాష్ట్ర సంస్కృతిలో భాగం కల్లు. తరాలు మారినా తరగని క్రేజ్ ఒక్క కల్లుకే ఉంది. ఇప్పటికీ గ్రామాల్లో పొద్దటి కల్లు తాగందే.. ఏ పనీ చేయరు. అంతలా మన జీవన సంస్కృతిలో కల్లు ఓ భాగంగా వస్తోంది. కానీ ఇటీవల కాలంలో కల్లు అంటే కేవలం కల్లు మాత్రమే కాదు అదో రసాయనం. అదో కెమికల్ మిశ్రమంగా మారిపోయింది.
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మిస్ వరల్డ్ అందాల పోటీల్లో సుందరీమణులు మన తెలంగాణ తాటి కల్లు తాగి సూపర్ ఉంది అని మెచ్చుకున్నారు. అలా ఓ వైపు మన రాష్ట్ర ప్రభుత్వం మన సంస్కృతి, సంప్రదాయ వంటకాలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలోనూ హైదరాబాద్ లాంటి నగరాల్లో నీరా కేప్ లు పెట్టి మరీ అప్పటి ప్రభుత్వం కల్లును ప్రోత్సహించింది.
కానీ ఇటీవల కొందరు మాత్రం డబ్బు కోసం స్వచ్ఛమైన కల్లును విషపూరితంగా మారుస్తున్నారు. రసాయనాలు కలిపి కల్లు అని పేరు పెట్టి అమ్మేస్తున్నారు. అటు నగరాల్లోనూ.. ఇటు పల్లెల్లోనూ ఇప్పుడు ఇదే దందా నడుస్తోంది. ముచ్చటపడి తెలియక ఈ రసాయన కల్లు తాగి.. ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు. ఇందుకు నిదర్శనమే ఇటీవల కూకట్ పల్లిలో జరిగిన ఘటన.
హైదరాబాద్ కూకట్పల్లి లో ఇటీవల కల్తీ కల్లు ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. కల్తీ కల్లు తాగి ప్రాణాలు విడిచిన వారి సంఖ్య 9 కి చేరింది. ఇక మరో 50 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో ఇంకా చికిత్స పొందుతూ ఉన్నారు. మృతుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కల్లు కాంపౌండ్ లపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కల్లు కాంపౌండ్ ల నిర్వహణ, కల్లు అమ్మకాలపై పరిశీలన చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 3 కల్లు కాంపౌండ్ లపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. అటు ముషీరాబాద్ లో అనుమతులు లేని కల్లు కాంపౌండ్ ను అధికారులు సీజ్ చేశారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో కల్తీ కల్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్న నేపథ్యంలో కల్లును బ్యాన్ చేయాలని పలు సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రజల ప్రాణాలు తీస్తున్న ఈ కల్లును రాష్ట్రంలో నిషేధించాలని ప్రభూత్వానికి డిమాండ్ చేస్తున్నారు. మరి తాజా పరిణామాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications