విడదీస్తే ప్రాణానికే ముప్పు: వీణా-వాణీలపై కోర్టుకు సర్కారు
హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా-వాణీల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) ఎస్ శరత్కుమార్ మంగళవారం హైకోర్టుకు తెలిపారు. నీలోఫర్ ఆస్పత్రిలోనే వైద్యులు, నర్సుల పర్యవేక్షణలో వీణావాణీలు సురక్షితంగా ఉన్నారన్నారు.
ఇప్పుడు వారికి 14 ఏళ్లు వచ్చాయనీ, వారిని విడదీసేందుకు శస్త్రచికిత్స చేస్తే, ప్రాణాలకు ముప్పు ఉందని వైద్య నిపుణులు తెలిపారన్నారు. డబ్బు ఖర్చుచేసే విషయంలో ప్రభుత్వం వెనుకాడటం లేదన్నారు. వీణా-వాణీలకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తని రీతిలో శస్త్రచికిత్స చేసేందుకు పిటిషనర్ సంస్థ ఎవర్నైనా సూచిస్తే, వారితో సంప్రదింపులకు సిద్ధమని చెప్పారు.
వీణా-వాణీ: 14ఏళ్ల వ్యథ తీరేదెప్పుడు?
ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం... తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది.
అవిభక్త కవలలను వేరుచేయడంలో జరుగుతున్న జాప్యంపై హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలుచేసింది. వారి అవసరాల నిమిత్తం నెలకు రూ.15 వేలు చెల్లించడానికి అనుమతించాలని కోరింది.
కాగా, వీణా-వాణిల శస్త్రచికిత్స జరిపేందుకు దేశ, విదేశీ వైద్య నిపుణుల అభిప్రాయాలను సేకరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. వారిని విడదీసే శస్త్రచికిత్సతో ఇరువురి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వైద్య నిపుణులు చెప్పార ని వివరించింది. దీంతో ఆపరేషన్ నిర్వహణపై పునరాలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్కుమార్ నివేదించారు.
వీణా- వాణీల సంరక్షణ బాధ్యతలు తమకు అప్పగించాలని స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై ప్రభు త్వం వివరణ ఇచ్చింది. స్వచ్ఛంద సంస్థ సిఫారసు చేసిన వైద్యులు ఆపరేషన్ చేసి వీణా-వాణిల ప్రాణాలు సురక్షితంగా ఉంచుతామని హామీ ఇస్తే వైద్య ఖర్చులు భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. కాగా, తాజాగా, ఆస్ట్రేలియా వైద్యుల బృందం కూడా వీణావాణీలను పరిశీలించించారు. అయితే, శస్త్ర చికిత్సపై ఎలాంటి నిర్ణయం తెలుపలేదు.