రాజ్ భవన్ నుంచి ప్రగతి భవన్కు తీపి కబురు..!!
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ ను కేసీఆర్ ప్రభుత్వం ఉపసంహరించుకున్న అనంతరం కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై ఆమె సంతకం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్- ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం మధ్య కొంతకాలంగా కొనసాగుతూ వస్తోన్న ప్రచ్ఛన్న యుద్ధానికి తెర పడినట్టే కనిపిస్తోంది. రాజ్ భవన్ తో ఘర్షణ వైఖరికి పుల్ స్టాప్ పెట్టింది. గవర్నర్ తో సయోధ్య దిశగా ఓ అడుగు ముందుకు వేసింది. తమిళిసైపై న్యాయపరమైన యుద్ధానికి దిగిన కేసీఆర్ ప్రభుత్వం.. కొన్ని గంటల వ్యవధిలోనే అనూహ్యంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో- బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రసంగానికి రాజ్ భవన్ ఇంకా ఆమోదం తెలపట్లేదనే కారణంతో కేసీఆర్ ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తమిళిసై సౌందరరాజన్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ నెల 3వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాల్సి ఉందని, బడ్జెట్ ప్రతిపాదనలను గవర్నర్ ఇంకా ఆమోదించట్లేదని పేర్కొంది.
ఈ ప్రతిపాదనలను ఆమోదించేలా గవర్నర్ కార్యాలయాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసింది. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించిన ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ పిటీషన్ ను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ధర్మాసనానికి సమాచారాన్ని పంపించింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే- వెల్లడించారు.
తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో రాజ్ భవన్ నుంచి కేసీఆర్ ప్రభుత్వానికి తీపి కబురు అందింది. బడ్జెట్ ప్రతిపాదనలప గవర్నర్ తమిళిసై సంతకం చేసినట్లు సమాచారం ఇచ్చింది. బడ్జెట్ ప్రతిపాదనలు, అసెంబ్లీని సమావేశపర్చడానికి గవర్నర్ అంగీకరించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై సంతకం చేశారు.
అంతకుముందు- గవర్నర్ వేసిన పిటీషన్ ను ఉపసంహరించుకున్న తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. మర్యాదపూరకంగా ఆమెతో భేటీ అయ్యారు. దీనితో గవర్నర్- ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణానికి తెరదించినట్టయింది.
ఆ మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది- మెగాస్టార్..!!