Chakali Ilamma : అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి,వర్ధంతి కార్యక్రమాలు-తెలంగాణ సర్కార్ నిర్ణయం
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి , వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం తరుపున అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చాకలి ఐలమ్మ సెప్టెంబరు 26, 1895న జన్మించారు. సెప్టెంబర్ 10, 1985న మరణించారు. భూమి కోసం,భుక్తి కోసం,దోపిడీ,పీడన నుంచి విముక్తి కోసం జరిగిన ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలో దొరల గడీలను చాకలి ఐలమ్మ గడగడలాడించింది.
చాకలి ఐలమ్మ చరిత్ర :
1919 లో వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలుకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది. పాలకుర్తి కి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం, చాకలి కులవృత్తే వారికి జీవనాధారం. ఆనాటి నిజాం సంస్థానంలో తెలంగాణ భాగంగా ఉండేది. 1940 లలో దొరలు, దేశ్ ముఖ్ లు, దేశ్ పాండేలు, భూస్వాములు, పెత్తందార్లు, నిజాం రాజుకు కప్పం కడుతూ గ్రామాలపై అధికారం చలాయించేవారు. ప్రజలను వివిధ రకాల పన్నుల పేరుతో పీడించడం,వెట్టి చాకిరి చేయించడం చేసేవారు.

కుల వృత్తితో కుటుంబం గడవడం గగమనవడంతో... వ్యవసాయం చేయాలని ఐలమ్మ భావించింది. పాలకుర్తికి పక్కనే ఉన్న మల్లంపల్లి దొర కుటుంబానికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంది. విసునూరు దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి అది సహించలేదు.ఆమెపై కక్ష పెంచుకున్నాడు. కౌలుకు తీసుకున్న భూమిలో కాపుకొచ్చిన పంటను కాజేయాలని పన్నాగం పన్నాడు. గూండాలను పురమాయించాడు.
అప్పటికే ఐలమ్మ ఆంద్ర మహాసభ సంఘంలో చేరింది. సంఘం అండతో గూండాలను తరిమికొట్టి తన పంటను కాపాడుకుంది. ఆ సమయంలో కొంగు నడుముకు చుట్టి కొడవలి చేతపట్టి సివంగి వోలె ఐలమ్మ గర్జించిందని చరిత్రకారులు చెబుతారు. ఆ తర్వాత కూడా విసునూరు దొర ఐలమ్మపై బెదిరింపులకు దిగాడు.. ఊరందరినీ ఏకం చేసి తిరగబడేలా చేస్తున్నందుకు... తుపాకీతో కాలుస్తానని ఆమెను బెదిరించాడు. ఆ బెదిరింపులకు ఐలమ్మ ఏమాత్రం బెదరలేదు. తనను చంపితే జనం తిరగబడతారని, భూములు పంచి గడీని కూలుస్తారని హెచ్చరించింది. ఐలమ్మ చూపిన పోరు దారిలో సాయుధ రైతాంగ పోరాటం విజయవంతమైంది.దొరలు గడీలు వదిలి పారిపోయారు.ఆ తర్వాత దొరల భూములను కమ్యూనిస్టులు ప్రజలకు పంచారు.
దొరపై పోరాట క్రమంలో ఐలమ్మ ఓ కొడుకును పోగొట్టుకుంది. మరో ఇద్దరు కొడుకులు, భర్త జైలు పాలయ్యారు. నల్లగొండలోని జైలులో వారిని కలిసేందుకు ఐలమ్మ ఒంటరిగా 100 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వచ్చేది. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985 న అనారోగ్యంతో మరణించింది.పాలకుర్తిలో ఐలమ్మ స్మారక స్థూపం ఏర్పాటైంది. అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా 'దొరా' అని ఉత్పత్తికులాల (చేత పిలుపించుకొనే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు. అందుకే ఆమె పోరాట స్పూర్తి చరిత్రలో నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications