తెలంగాణలో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు- తేదీలివే- నోటిఫికేషన్ విడుదల..!
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాణి కుముదిని ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వీలుగా నోటిఫికేషన్ విడుదల చేసారు. దీని ప్రకారం మూడు దశల్లో పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వీటికి నామినేషన్ల స్వీకరణ కూడా ఎల్లుండే ప్రారంభం కానుంది. దీంతో పాటు ఇతర వివరాల్ని ఎస్ఈసీ కుముదిని వెల్లడించారు.
తెలంగాణలో మొత్తం మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాణి కుముదిని ఇవాళ వెల్లడించారు. ఇందులో మొత్తం 4200 సర్పంచ్ స్ధానాలకు, 37440 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే తొలి దశలో డిసెంబర్ 11న, రెండో దశలో డిసెంబర్ 14న, మూడో దశలో డిసెంబర్ 17న ఎన్నికలు జరుగుతాయని ఆమె తెలిపారు. ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎస్ఈసీ ప్రకటించారు.

మూడు దశల పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కొనసాగుతుందని ఎస్ఈసీ రాణి కుముదిని తెలిపారు. అలాగే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభిస్తామని వెల్లడించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం తొలిసారిగా వెబ్ సైట్ లో గ్రీవెన్స్ మాడ్యూల్ కూడా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. రెండు, మూడు రోజుల్లో యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు తీసుకుంటామన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు.












Click it and Unblock the Notifications