తెలంగాణలో భూములకు రికార్డు ధర.. రాయదుర్గంలో ఎకరం రూ. 269 కోట్లు
హైదరాబాద్ ఐటీ కారిడార్ లోని భూముల ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. రాయదుర్గంలో భూమికి మరోసారి రికార్డు ధర లభించింది. టీజీఐఐసీ ఇవాళ నిర్వహించిన వేలంలో ఎకరం ఏకంగా రూ.269 కోట్లు పలికింది. రాయదుర్గం పాన్ మక్తాలోని ఈ భూమిని ఇవాళ టీజీఐఐసీ వేలం వేసింది. మొత్తం 5.38 ఎకరాలను ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరామ్ బిల్డర్స్ దక్కించుకుంది. వారం రోజుల క్రితం ఇదే రాయదుర్గం ప్రాంతంలో ఎకరం భూమి రూ.264 కోట్లకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. దాంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరోసారి భూముల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ మేరకు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఐటీ, వాణిజ్య కార్యకలాపాలకు కీలకమైన ప్రాంతాల్లో భూములకు భారీ డిమాండ్ కొనసాగుతోంది.
రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1 పాన్ మక్తా పరిధిలోని 5.38 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం వేలానికి ఉంచింది. దీనికి ఎకరానికి రూ. 175 కోట్లను ప్రభుత్వ అధికారులు కనీస ధరగా నిర్ణయించారు. అయితే ఆన్ లైన్ వేలంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో ధర అనూహ్యంగా పెరిగింది. అలా చివరికి ఎకరం రూ. 269 కోట్ల చొప్పున వంశీరామ్ బిల్డర్స్ ఈ స్థలాన్ని కైవసం చేసుకుంది. ఇంత భారీ స్థాయిలో ధర పలకడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ లెక్కన 5.38 ఎకరాలకు మొత్తం సుమారు రూ.1,447 కోట్లు విలువ పలికింది. దీంతో TGIIC కు భారీగా ఆదాయం సమకూరింది.

ఇక రాయదుర్గం పరిసరాల్లో గత కొంతకాలంగా భూముల ధరలు గణనీయంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్ లో ఎకరం ధర రూ. 177 కోట్లు ఉండగా.. ఈ ఏడాది మే నెలలో అది రూ. 237 కోట్లకు చేరింది. అదే ఇప్పుడు తాజాగా ఈ ధర రూ. 269 కోట్ల మైలురాయిని చేరుకుంది. ఈ పరిణామాలు చూస్తూంటే రాజధానిలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఎదుగుతుందో అర్థం అవుతోంది. ఐటీ హబ్, గచ్చిబౌలి, నాలెడ్జ్ సిటీ వంటి కీలక ప్రాంతాలు ఇక్కడికి సమీపంలోనే ఉండటంతో ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.












Click it and Unblock the Notifications