సివిల్ జడ్జి పరీక్షలు: లాయర్ల రాకతో ఉద్రిక్తత
హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ ఇప్పుడే వద్దని డిమాండ్ చేస్తూ, తెలంగాణ న్యాయవాదులు పరీక్షలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. నగరంలోని మీర్ పేట్లో జరుగుతున్న జూనియర్ సివిల్ జడ్జిల నియామక పరీక్షను న్యాయవాదులు అడ్డుకోగా, పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ పరీక్ష ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. హైదరాబాద్, వరంగల్, తిరుపతి, విశాఖ, విజయవాడల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 97 పోస్టుల కోసం 8 వేల మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.
తెలంగాణ న్యాయవాదులు రావచ్చనే ఆలోచనతో ముందు జాగ్రత్తగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఉదయం 8.30 గంటల నుంచి అభ్యర్ధులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది.
సివిల్ జడ్జి పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తాను తెలంగాణ న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ కోరిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి వేరు వేరు నోటిఫికేషన్లు జారీ చేయాలన్నది వీరి ముఖ్య డిమాండ్.